హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్కు ప్రధాన వాహకులుగా భావిస్తున్న సూపర్ స్ప్రెడర్ల (అత్యవసర సేవకులు)కు శుక్రవారం నుంచి మూడురోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల వరకు సూపర్ స్ప్రెడర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో వీరిలో వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది.
సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్తో మూడోవేవ్కు అడ్డుకట్ట
నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాల తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జర్నలిస్టులు తదితరులను సూపర్ స్ప్రెడర్లుగా భావించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వీరికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా వైరస్ చైన్ను తెంచడానికి ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు గుర్తించారు.
తొలి దశలో 7.75 లక్షల మందికి
ప్రత్యేక డ్రైవ్ ద్వారా మొదటి దశలో 7.75 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేసింది. 33,980 మంది రేషన్ డీలర్లు, 49,611 మంది గ్యాస్ డీలర్లు, సిబ్బంది, 1,435 మంది ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగులు, 30 వేల మంది ఎరువులు, విత్తనాల దుకాణదారులు, సిబ్బంది, 20 వేల మంది జర్నలిస్ట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల మంది అటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, రైతుబజార్లలో వర్తకులు, మార్కెట్ యార్డు సిబ్బంది, హమాలీలు, వీధి వ్యాపారులు, 3 లక్షల మంది సెలూన్ల నిర్వాహకులు, 91 వేల మంది కిరాణదుకాణాల సిబ్బంది ఉన్నారు.