హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వచ్చేవారంలో టీనేజర్లకు (12-17 ఏండ్లు) కొవిడ్ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్టు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో ఆ టీకాల పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణలో ఇప్పటికే 18 ఏండ్ల పైబడినవారికి రోజుకు మూడు లక్షల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. టీనేజర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
జైకోవ్-డీ వచ్చే అవకాశం
టీనేజర్ల కోసం వివిధ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నారు. వాటిలో రెండు కంపెనీలు ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఒక వ్యాక్సిన్ను, గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా జైకోవ్-డీవ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఇవి రెండూ ముక్కు టీకాలే కావడం విశేషం. ఈ ఏడాది ఆగస్టు 20న డ్రగ్ కంట్రోలర్ జెనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి జైకోవ్ -డీ అత్యవసర అనుమతులను సైతం పొందింది. భారత్ బయోటెక్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని డీసీజీఐకి వివరాలు సమర్పించేందుకు సిద్ధమైంది. మొదట జైకోవ్ -డీ వ్యాక్సిన్ పంపిణీతో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని, ఆ తర్వాత ఇతర కంపెనీలకు అనుమతులు ఇవ్వాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. ధర నిర్ణయంపై జైడస్ క్యాడిలా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ధర రూ.1900గా విధించాలని ఫార్మా కంపెనీ ప్రతిపాదించగా.. ధర తగ్గింపు విషయంపై భారత ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. మరోవారంలోగా ఈ సందిగ్ధానికి తెరదింపాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.