హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19ను నియంత్రించటంలో అన్నిరాష్ర్టాలకంటే ముందున్న తెలంగాణ.. వ్యాక్సినేషన్లోనూ దేశానికి మార్గదర్శిగా నిలిచింది. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకొంటున్నాయి. రాష్ట్ర వ్యాక్సినేషన్ ప్రణాళికలను ప్రశంసిస్తూ వైద్యరంగ ప్రముఖులు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ లాన్సెట్లో ప్రత్యేక వ్యాసం ప్రచురించారు. ‘వ్యాక్సినేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సరైన కోణంలో సాగుతున్నది. టీకాలు ఇష్టానుసారంగా కాకుండా వైరస్ను వ్యాప్తిచెసే అవకాశం ఉన్న వర్గాలను గుర్తించి, ప్రాధాన్య క్రమంలో సమర్థవంతంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నది. కేవలం నెల రోజుల్లో 30.73 లక్షల మందికి టీకాలు వేయటం గొప్ప విషయం’ అని లాన్సెట్ ప్రశంసించింది.
కష్టకాలంలో సీఎం కేసీఆర్ ముందు చూపు
దశదశలుగా విజృంభిస్తున్న కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలి.. జనాభా కోట్లల్లో.. కేంద్రం ఇస్తున్న టీకాలు వేలల్లో.. ఇలాంటి సమయంలో సరైన వ్యూహం రచించి అమలు పరిచారు సీఎం కేసీఆర్. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్లను అందరికీ వేయడంకంటే, వైరస్ బారినపడే అవకాశం ఎక్కువ ఉన్నవారికి ఇవ్వడం వల్ల మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని ఆలోచించారు. దేశంలోనే తొలిసారి హైరిస్క్ గ్రూప్ అనే క్యాటగిరీని రాష్ట్రంలో మొదలు పెట్టారు. నిత్యం ప్రజలతో మమేకమమై కార్యకలాపాలు కొనసాగించేవారు, ఎక్కువ రాకపోకలు కొనసాగించేవారిని కొన్ని గ్రూపులుగా విభజించించారు. మూడు దశల్లో వీరికి వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఎల్పీజీ డీలర్లు, జర్నలిస్టులు, ఆర్టీసీ ఉద్యోగులు, దుకాణదారులు, చిరు వ్యాపారులు, హోటళ్లు, మెడికల్ షాప్స్, ఐరన్ షాప్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్.. ఇలా అనేక విభాగాల వారికి టీకాలు వేశారు. ఈ విధానం ఇప్పుడు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మార్గదర్శకమైంది.
ఒకే నెలలో 34 లక్షల మందికి
జనసహాయకులకు (హైరిస్క్ గ్రూపు) ప్రభుత్వం మూడు దశల్లో వ్యాక్సినేషన్ నిర్వహించింది. ఒక్క నేలలోనే 34 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. ప్రాధాన్య వర్గాలను గుర్తించి పకడ్బందీగా టీకాలు వేస్తున్నారు. ఈ విధానంపై తొలుత దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ప్రధాని మోదీ సైతం దీనిని ప్రస్తావించారు. తాజాగా అంతర్జాతీయ వైద్యరంగ నిపుణులు ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మంచి నిర్ణయమని మద్దతు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నది. మొదటి దశలో 1.19 లక్షల మందికి, రెండో దశలో 28 లక్షల మందికి, మూడో దశలో 4.73 లక్షల మందికి కలిపి మొత్తం 34,85,888 మంది జనసహాయకులకు టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు.