హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్కు అరుదైన అవకాశం లభించింది. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్య రాజ్యసమితి న్యూయార్క్ వేదికగా ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వహించే అంతర్జాతీయ జల సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం దక్కింది. ఈ మేరకు యూఎన్ సెక్రటేరియట్ బుధవారం ఆహ్వాన లేఖ పంపింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న భూతాపం తదితర అంశాలపై చర్చించనున్నారు. పరిశోధన పత్రాలను సమర్పించనున్న ఈ సదస్సుకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రాచుర్యం పొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ కూడా హాజరవుతున్నారు.