హైదరాబాద్ : భూపాలపల్లి డీటీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న డీటీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో డీటీవో వెంకన్నపై ఇసుక లారీ దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, విధి నిర్వహణలో ఉన్న అధికారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు అవసరమైన భద్రతా చర్యలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డీటీవో వెంకన్న అకాల మరణం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన వి. లచ్చిరెడ్డి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.