హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రైస్ మిల్లులో బియ్యం నిల్వలు, నిర్దేశించిన లక్ష్యం మేరకు రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీ అనిల్కుమార్ స్పష్టంచేశారు. ‘మిల్లర్ల దందా’ పేరుతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. రైస్ మిల్లులలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
నిల్వల్లో తేడాలుంటే కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎంఆర్లో అక్రమాలకు పాల్పడుతున్న మిల్లులపై 2022లో 6ఎ కేసులు 178 నమోదయ్యాయని వివరించారు. కేసులు నమోదైన మిల్లులకు ధాన్యాన్ని కేటాయించడంలేదని తేల్చిచెప్పారు. పీడీయస్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేసి తిరిగి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగించకుండా మిక్స్డ్ ఇండికేటర్ టెస్ట్ గత ఏడాది అక్టోబర్ నుంచి అమలులోకి తెచ్చినట్టు చెప్పారు. దీని ద్వారా బియ్యం కాలవ్యవధిని సులువుగా గుర్తించి అక్రమాలను అరికడుతున్నామని స్పష్టంచేశారు.