UTF | ఖమ్మం రూరల్ : ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా, పాఠశాలల బలోపేతమే పరమావధిగా భావించి ఆరేండ్ల పాటు సేవలందించిన అలుగుబెల్లి నరసింహారెడ్డిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ కాలనీ యందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిజాయితీ నిబద్ధతకు అలుగుబెల్లి మారుపేరు అన్నారు. గడిచిన ఆరేండ్ల కాలంలో ఎమ్మెల్సీ నిధులను పాఠశాలల అభివృద్ధి కోసం వెచ్చించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. తనకు వచ్చే నెల నెల జీతాన్ని సైతం పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వెచ్చించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఖమ్మం, వరంగల్, నల్లగొండ టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు అనేక మాయ మాటలు చెబుతున్నారని ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎన్నికైతే సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం వారి అనుబంధంగా ఉన్న పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయని సిపిఎస్ని ఎందుకు రద్దు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఉపాధ్యాయుల పాఠశాలల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కనబరిచిన అలుగుబెల్లిని మరోసారి ఉపాధ్యాయులు ఆశీర్వదిస్తే మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. పెద్దలు చుక్కా రామయ్య విజయం సాధించిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఆయన మార్గంలోని అలుగుబెల్లి పోటీ చేయడం జరుగుతుందన్నారు. అలుగుబెల్లికి ఇప్పటికే టిపిటిఎఫ్ మద్దతు ప్రకటించడం జరిగిందని అనేకమంది ఉపాధ్యాయులు మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి అలుగుబెల్లికి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అఖండ విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టిపిటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంజాన్, సెక్రటరీ షరీఫ్, నాయకులు రాజశేఖర్, ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.