హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సౌర విద్యుత్తులో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో సోలార్ విద్యుత్తు వినియోగించి ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించామని చెప్పారు. శనివారం హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో టీఎస్ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా రాజీవ్సాగర్ మాట్లాడుతూ.. టీఎస్ ఫుడ్స్లో కొత్తగా మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నెలకు 28 లక్షల విద్యుత్తు బిల్లు వస్తున్నదని, కొత్త ప్లాంటుతో బిల్లు మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తు దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో విద్యుత్తు ఖర్చులు దాదాపు 50 శాతం వరకు తగ్గే అవకాశమున్నదని వెల్లడించారు. అనంతరం సతీశ్రెడ్డిని శాలువాతో సన్మానించారు.