హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని వివిధ పథకాల అమలులో సమర్థవంతంగా వినియోగిస్తున్నదని రాష్ట్ర ఐటీశాఖ (ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్) ఓఎస్డీ రమాదేవి పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ‘ఎక్స్పీరియన్స్ స్టూడియో ఆన్ డ్రోన్స్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ పథకాల అమలులో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును వివరించారు. ముఖ్యంగా డ్రోన్లను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు మందులను సరఫరా చేసేందుకు వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన మెడిసిన్ ఫ్రమ్ ద స్కై, అడవుల్లో విత్తనాలను వెదజల్లేందుకు ఉద్దేశించిన హరా బహరా పథకాలతో పాటు దోమల నియంత్రణ కోసం చేపట్టిన మస్కిటో ఎరాడికేషన్ కార్యక్రమాల గురించి ప్రతినిధులకు అవగాహన కల్పించారు.