గజ్వేల్, నవంబర్ 29: తెలంగాణలో అర్బన్ పార్కుల అభివృద్ధి బాగున్నదని డెహ్రాడూన్కు చెందిన ఫారెస్ట్ సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం కితాబిచ్చింది. అడవిని అర్బన్ పార్కుగా తీర్చిదిద్దడం ఎంతో బాగున్నదని బృందం సభ్యులు ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ అర్బన్ పార్కును మంగళవారం డెహ్రాడూన్ ఫారెస్ట్ సర్వీసెస్ కళాశాలలో శిక్షణలో ఉన్న 71 మంది గ్రూప్-1 అధికారుల బృందం సందర్శించింది.
శిక్షణలో భాగంగా వీరు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని అడవులను సందర్శించారు. హైదరాబాద్లోని జూపార్కును సందర్శించిన అనంతరం మంగళవారం గజ్వేల్ అర్బన్ పార్కు సందర్శనకు వచ్చారు. గజ్వేల్ ప్రాంతంలో అడవుల పునరుజ్జీవనం, తెలంగాణలో అర్బన్ పార్కుల అభివృద్ధి ఎంతో బాగున్నదని వారు మెచ్చుకున్నారు.