హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటూ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఈనెల 21 నుంచి మూడురోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్న స్టాండింగ్ కమిటీ సోమవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశమైంది.
పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ వివరించారు. హైదరాబాద్ నగరం సహా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఇక్కడి సౌకర్యాలు బాగున్నాయని కమిటీ ప్రశంసించింది. తెలంగాణలో సమర్థవంతంగా నిధులను ఖర్చు చేస్తున్నారని, దీంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సమకూరుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు బాగా అమలవుతున్నాయని అభినందించింది. పీఎం స్వనిధి పథకాన్ని రాష్ట్రం బాగా అమలు చేస్తున్నదని కమిటీ సభ్యులు ప్రశంసించారు.
అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులు వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్సింగ్ ప్రైవేటు బ్యాంకర్లకు స్పష్టం చేశారు. మార్చిలోగా నిర్ణీత లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం, మొక్కల పెంపకం, సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు, ఎఫ్ఎస్టీపీలు, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కార్యక్రమాల అమలు బాగున్నదని కమిటీ అభిప్రాయపడిందని సమాచారం. హైదరాబాద్ సహా ఎక్కడ చూసినా మొక్కల పెంపకంతో పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతున్నదని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ చెత్తతో సంపదను సృష్టించే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిశోర్ మాట్లాడుతూ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అనుసరించి ఆగస్టు నాటికి 100 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పూర్తి చేస్తామన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రాయదుర్గం- శంషాబాద్ మెట్రో రైలు నిర్మాణ విశేషాలను వివరించారు. దీని పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 254 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంజయ్ సింగ్, రామలింగం, బండి సంజయ్, ఆరిఫ్, శ్రీరంగ అప్ప బార్ని, బెన్ని బెహనన్, రామ్చరణ్ బోహరా, హిబ్బీ ఈడెన్, గౌతమ్ గంభీర్, జలీల్, శంకర్ లల్వాని, హేమమాలిని, రాజ్యసభ సభ్యులు శుభాశిస్ చక్రవర్తి, గిరిరాజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రీనరీ గణనీయంగా పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పార్లమెంటరీ కమిటీ సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హరితహారం చేపట్టిందని, అది గణనీయంగా అటవీ విస్తీర్ణానికి దోహదపడిందని చెప్పారు. ఏడు శాతం అదనంగా గ్రీనరీ పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించినదని సభ్యులకు శాంతికుమారి వివరించారు. రాష్ట్రంలో సీఎంకేసీఆర్ మార్గదర్శకత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని తెలిపారు.
పక్కా ప్రణాళికతో పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడంతో పట్టణాలన్నీ అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ పార్లమెంటరీ కమిటీ సభ్యులకు వివరించారు. పట్టణ ప్రగతి ద్వారా సువిశాల రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, వెజ్ నాన్ వెజ్ మారెట్లు, వైకుంఠధామాలు, ఓపెన్ జిమ్లు, స్టేడియంలు, గ్రీనరీ, ఆనె్లైన్ బిల్డింగ్ పర్మిషన్లు, అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఫలితంగా సఫాయి కర్మచారి, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రతీఏటా వస్తున్నాయని తెలిపారు.