హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోదీ సర్కారుకు చరమగీతం పాడేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించాలని ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కోరారు. కేంద్రం పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నదని, అందుకు కేసీఆరే నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికార నివాసంలో వీరు సమావేశమయ్యారు.
అఖిలేశ్కు సీఎం శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. కేంద్రంలోని మోదీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది. జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి బతుకును దుర్భరం చేస్తున్న మోదీ దిగిపోవాల్సిందేనని సీఎం కేసీఆర్ ఇటీవల హెచ్చరించిన సందర్భాన్ని అఖిలేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. ప్రజల ఎజెండాయే పార్టీల ఎజెండా కావాలని, అందుకు ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని, అందుకు సీఎం కేసీఆరే ముందుకు రావాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, పార్లమెంట్ లోపల, బయటా బీజేపీ విధానాలపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అఖిలేశ్కు సూచించినట్టు తెలిసింది. భేటీలో ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు.