హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్నిపెంచేందుకు కమర్షియల్ టాక్స్శాఖ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఈ సందర్భంగా యూపీ బృందానికి సీఎస్ సోమేశ్కుమార్ వివరించారు. వాణిజ్య పన్నులశాఖ మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో వాణిజ్య పన్నులశాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం 2014లో సుమారు రూ.23వేల కోట్లు ఉండగా, గత సంవత్సరం దాదాపు మూడు రేట్లకు పెరిగి రూ.65వేలకోట్లకు చేరిందని వివరించారు.
రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత మార్పుల ద్వారా శాఖ పనితీరులో గణనీయమైన మార్పు వచ్చిందని చెప్పారు. మాన్యువల్ ఆధారిత నోటీసులు, ప్రొసీడింగ్ల జారీలను పూర్తిగా తొలగించామని చెప్పారు. ప్రతీస్థాయిలో భౌతిక లక్ష్యాల స్థానంలో నిర్ధారిత ఆధారిత లక్ష్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు తదితర చర్యల ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించామని, కొత్తగా శాఖాపరంగా పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా, తెలంగాణా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అమలవుతున్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడం తమకు అవకాశం లభించిందని ఉత్తరప్రదేశ్ అధికారులు తెలిపారు. తెలంగాణా ప్రభుత్వ ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎస్ మినిస్టి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్కు చెందిన అదనపు కమిషనర్లు సాయి కిషోర్, కాశి, శోభన్బాబులతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన కమర్షియల్ టాక్స్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.