హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాతీయ పార్కుల పరిరక్షణకు అటవీశాఖ అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో మృగవని, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యాన వనాల కొత్త లోగోలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్లోని వనస్థలిపురంలో మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు 1,459 హెక్టార్లలో విస్తరించి ఉన్నదని చెప్పారు.
ఈ పార్కులో మచ్చల జింకలు, బ్లాక్ బక్స్, అడవి పిల్లులు, అనేక రకాల సరీసృపాలు, పక్షులు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో సహజ అభయారణ్యంగా ఉన్న దీన్ని అటవీ శాఖ పట్టణ జాతీయ ఉద్యానవనంగా తీర్చిదిద్దిందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో మృగవని జాతీయ పార్కు చేవెళ్ల రోడ్డు వైపు 360 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నదని, విభిన్న వృక్ష, జంతుజాలంతో కూడిన ఈ పార్కు పట్టణ అడవుల్లో ఒకటని పేర్కొన్నారు.
ఈ పార్కులోని వైవిధ్యభరితమైన మొకలు, జంతువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. లోగోలు పారుల పరిరక్షణ సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ సైదులు, రంగారెడ్డి జిల్లా డీఎఫ్వో జాదవ్ రాహుల్ కిషన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.