హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సాయుధ దళాల కోసం రూపొందించిన మానవ రహిత గైడెడ్ వాహనం (యూజీవీ)ని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్, డిఫెన్స్ పరికరాల తయారీ సంస్థలు రఘు వంశీ గ్రూప్, ఏఆర్ రోబోట్ కలిసి రూపొందించిన ఈ యూజీవీ ఆవిష్కరణ సందర్భంగా ఏఆర్ రోబోట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి ఆచంట మాట్లాడారు. సాయుధ దళాల అవసరాలైన నిఘా, లాజిస్టిక్, భూభాగంపై కష్టమైన చోట, పర్యావరణ అధ్యయనంలో ఉపయోగించేలా దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని తెలిపారు. ఇది 200 కిలోల బరువును తీసుకువెళ్తుందని, 30 డిగ్రీల కోణంతో తిరుగుతూ సుమారు 600 కిలోల బరువును లాగే సామర్థ్యం ఈ వాహనానికి ఉందని చెప్పారు.