సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలో మిట్ట మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఓ కారుపై కాల్పులు జరిపిన దుండగులు, అద్దాలు పగులగొట్టి రూ. 43.50 లక్షలను అపహరించారు. రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న ఓ రియల్టర్ కారును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్పై ఫాలో అయ్యారు. అయితే రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత వ్యక్తులు ఆఫీసు లోపలికి వెళ్లిపోయారు. దొమ్మాట మాజీ సర్పంచ్ నర్సయ్య శ్రీధర్ రెడ్డికి ఫ్లాట్ విక్రయించాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ రాయించుకున్న అనంతరం నర్సయ్యకు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 43.50 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును రెడ్ కలర్ బ్యాగులో పెట్టిన నర్సయ్య.. తన కారు డ్రైవర్ పరుశురామ్కు అప్పగించాడు. ఆఫీసులోకి వెళ్లి సంతకాలు చేసి వస్తానని, కారులోనే నగదు ఉంచి జాగ్రత్తగా ఉండాలని నర్సయ్య డ్రైవర్కు చెప్పాడు.
కారును ఫాలో అయిన ఇద్దరు దుండగులు నంబర్ ప్లేటులేని బైక్పై వచ్చారు. కారు అద్దాన్ని పగులగొట్టి.. డ్రైవర్ పరుశురామ్ కాలిపై కాల్పులు జరిపాడు. మరో వ్యక్తి అవతలి వైపు నుంచి వచ్చి నగదు ఉన్న బ్యాగును అపహరించారు. అనంతరం తుపాకీని అక్కడే వదిలిపెట్టి బైక్పై పారిపోయారు.
ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత పరిశీలించారు. ఘటనాస్థలిలో బుల్లెట్లను, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దుండగులు కంట్రీమేడ్ గన్తో కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను పోలీసులు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.