అచ్చంపేట/అమ్రాబాద్, నవంబర్ 13 : కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బీఆర్ఎస్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడికి తెగబడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని కుమ్మరోనిపల్లి గ్రామానికి వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గ్రామస్థులు ఘనంగా స్వాగతించారు. డ్యాన్స్లు, కోలాటలు, నృత్యాలు చేస్తూ ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని చాటుకొన్నారు. దీనిని జీర్ణించుకోలేని కుమ్మరోనిపల్లి కాంగ్రెస్ కార్యకర్త తిరుపతయ్య ఇటుకరాయితో ఎమ్మెల్యే గువ్వలపై దాడి చేశాడు. దీంతో ఆ ఇటుకరాయి ఎమ్మెల్యే చేతిని గాయపరిచి, పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు తగిలింది. దాడికి పాల్పడిన తిరుపతయ్యను గ్రామస్థులు పోలీసులకు పట్టించారు. కాగా, ఎమ్మెల్యే గువ్వలను కాంగ్రెస్ ముఠా హతమార్చడమే లక్ష్యంగా అడుగడుగునా రెక్కీ నిర్వహిస్తూ దాడులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్గాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అచ్చంపేటలో స్వయంగా కాంగ్రెస్ నేత వంశీకృష్ణ రాయితో దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పెద్ద ప్రమాదం తప్పి, గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మరువకముందే మరోసారి ఎమ్మెల్యేపై దాడి చేయడం ఆ పార్టీ నేతల అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ దాడులతో ప్రజల్లో భయాందోళన సృష్టించి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నదని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని, తనకు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్యే గువ్వల ఉద్వేగ ప్రసంగం చేశారు. ప్రజల మనసును గెలిచి తాను రెండుసార్లు ఎమ్మెల్యేనయ్యానని.. మరోసారి ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిదాడులు చేయొద్దని, సంయమనం పాటించాలని.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థులకు బుద్ధి చెప్పేలా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ దాడుల సంస్కృతిని అచ్చంపేట ప్రజలు అర్థం చేసుకొని ఆ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అచ్చంపేట ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, అచ్చంపేట ప్రజల కోసం తాను చావడానికైనా సిద్ధమేనని గువ్వల పేర్కొన్నారు.