హైదరాబాద్ : అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. అయితే అనాటమీ తరగతులు, పరిశోధనల కోసం మృతదేహాల కొరత తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ మరణం అయ్యుండి, ఆ మృతదేహాన్ని తీసుకుపోవడానికి ఎవరూ ముందుకురాని సందర్భంలో మాత్రమే అన్ని రకాల న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాలను మెడికల్ కాలేజీకి అప్పగించాలని స్పష్టం చేశారు. వాటికి ఎలాంటి పోస్ట్మార్టం నిర్వహించకుండా అప్పగించాలన్నారు. అన్ని జిల్లాల సూపరింటెండెంట్లు, కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఈ విషయాన్ని గుర్తించి, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.