హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని.. అక్షరజ్యోతులను వెలిగిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి భారీగా నిధులివ్వాలని వర్సిటీ వీసీ కుసుంబ సీతారామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే బడ్జెట్లో గ్రాంట్స్ను పెంచాలని విజ్ఞప్తిచేశారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని కోరారు.
మంగళవారం వర్సిటీలో రిజిస్ట్రార్ ఏవీఆర్ఎన్ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా రిక్రూట్మెంట్ నిలిచిపోవడంతో ఫ్యాకల్టీ కొరత సమస్య వర్సిటీని వేధిస్తున్నదని తెలిపారు. దీనిప్రభావం న్యాక్ ర్యాంకుపై పడుతున్నదని, మెరుగైన ర్యాంకు లేక యూజీసీ నిధులివ్వడంలేదని పేర్కొన్నారు. ఏపీ నుంచి వర్సిటీకి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని వీసీ కోరారు. ఏపీ విద్యార్థులకు ఈ పదేండ్లకు అందించిన సేవలకు 250 కోట్లు రావాల్సి ఉన్నదని తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి వర్సిటీలో ఏపీ అడ్మిషన్లను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి అడ్మిషన్ల గడువు ఈ విద్యాసంవత్సరంతో ముగిసింది. ఏపీలో బీఆర్ఏవోయూకు 76 స్టడీ సెంటర్లున్నాయి.