హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూలోని అన్ని రకాల ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో నూతన విద్యాసంవత్సరం నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్కు సంబంధించి 2022-23 అకడమిక్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఫస్ట్ స్పెల్ తరగతులు నవంబర్ 3 నుంచి డిసెంబర్ 12 వరకు 8 వారాలు నిర్వహిస్తారు. ఫస్ట్ మిడ్టర్మ్ ఎగ్జామ్స్ డిసెంబర్ 29 నుంచి వచ్చే జనవరి 4 వరకు నిర్వహించనున్నారు.
తిరిగి జనవరి 5 నుంచి మార్చి 2 వరకు సెకండ్ స్పెల్ నిర్వహించనున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు అంటే రెండు వారాలపాటు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 3 నుంచి సెకండ్ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు రెండు వారాలపాటు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ షెడ్యూల్ను అన్ని అఫిలియేటెడ్ కాలేజీలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఫస్ట్ సెమిస్టర్ కోసం 93 రోజులు, సెకండ్ సెమిస్టర్ కోసం 92 రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
జేఎన్టీయూ నూతన విద్యాక్యాలండర్ ప్రకారం ఈ నెల 26 నుంచే ఎంటెక్, ఎంఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మార్చి 13 నుంచి 25 వరకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల కోసం తరగతులు ప్రారంభించి ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 6 వరకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.