చిట్యాల, డిసెంబర్ 22: ధాన్యం కొనుగోలు గురిం చి కేంద్రంతో చర్చించడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీల పట్ల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అను చిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి తన మాటలతో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 55 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని, మరో 25 లక్షల క్వింటాళ్లు సేకరించాల్సి ఉన్నదని తెలిపారు. యాసంగిలో ధాన్యాన్ని రారైస్ చేస్తే నూక ఎక్కువగా వస్తుందని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ కొనుగోలుపై ఇకనైనా కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలున్నా ధాన్యం కొనుగోలు విషయంపై ఒక్కసారి కూడా కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందుతుంటే ఆ విషయంపై స్పందించకుండా.. టీఆర్ఎస్ను నిందించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వచ్చే సీజన్లో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో కేంద్రం స్పష్టత ఇస్తే అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుపై రైతులను అప్రమత్తం చేస్తుందని గుత్తా తెలిపారు.