హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘సీరియస్ రాజకీయాలు’ అంటూ ఓ జోక్ వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా శనివారం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజకీయాలను సీరియస్గా తీసుకోరని, ఓ లక్ష్యం లేదని అడ్డగోలుగా మాట్లాడారు. దీనిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
స్మృతి ఇరానీ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనను లక్ష్యంగా కేసీఆర్ 14 ఏండ్లపాటు తీవ్రంగా శ్రమించారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఏమిటో బీజేపీ సీనియర్ నేతలనే అడిగి తెలుసుకోవాలని స్మృతి ఇరానీకి సూచించారు. రాజకీయాలను సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకోకుంటే కేవలం ఎనిమిదేండ్లలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేదా? అని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాలను సీరియస్గా తీసుకోనిది, ప్రజలను మోసం చేస్తున్నది స్మృతి ఇరానీయేనని నిప్పులు చెరుగుతున్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీలో తావులేదని ఆమె చేసిన వ్యాఖ్యలను సైతం తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ మొదలుకొని ఎంతో మంది బీజేపీ నేతలు వారసత్వ రాజకీయాల్లో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. తన విద్యార్హతను ప్రకటించకుండా మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి స్మృతి ఇరానీయేనని ఎద్దేవా చేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులను వేధించిన చరిత్ర ఆమెదని మండిపడ్డారు.