హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): భారత రైల్వే వ్యవస్థ రానున్న పదేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో రైల్వే నెట్వర్క్ స్థాయిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఏపీలోని గుంటూరు జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. గుంటూరు నుంచి కొత్తగా మూడు (గుంటూరు-విశాఖ, నర్సాపూర్-హుబ్లీ, రేణిగుంట-కడప) రైళ్లను ప్రారంభించినట్టు తెలిపారు. రైలు మార్గాల విద్యుదీకరణకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఏపీలో అన్ని లైన్లను విద్యుదీకరించామని చెప్పారు. ఏపీలో కొత్తగా 371 కి.మీ. రైలు మార్గాన్ని నిర్మించామని, రైల్వేకు నిధుల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.