హైదరాబాద్: గత ఏడేండ్లలో విమానాశ్రయాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) అన్నారు. ఏడేండ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి చేరిందన్నారు. బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి సింథియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎయిర్పోర్టులు, హెలీప్యాడ్లు, ఎయిర్డ్రోమ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే గుజరాత్లో హెలీప్యాడ్లు, ఎయిర్డ్రోమ్లు సిద్ధమయ్యాయని చెప్పారు.
2024-25 నాటికి విమానాశ్రయాల సంఖ్యను 140 నుంచి 220కి పెంచుతామని సింథియా ప్రకటించారు. రెండేండ్లుగా విమానయాన రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నదని చెప్పారు. దానినుంచి వేగంగా పుంజుకుంటున్నదని వెల్లడించారు. విమానాశ్రయాల నిర్మాణాలు ఆర్థికవృద్ధికి కీలకమన్నారు. అత్యధిక ఉపాధి కల్పనరంగం ఏవియేషన్ అని చెప్పారు. వీ షేప్ రికవరీ సాధించిందని చెప్పారు. ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉందన్నారు.
అంతకుముందు మంత్రి వేముల ప్రశాంత్ మాట్లాడారు. ఎయిరో స్పేస్ తయారీ హబ్గా హైదరాబాద్ ఎదుగుతున్నదని మంత్రి చెప్పారు. ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్కు గర్వకారణమన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు. ఫ్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. పాత విమానాశ్రయాల పునరుద్ధరణకు, గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టులను అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రోన్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్ను చాటిచెప్పిందన్నారు.