Bandi Sajay | సంక్రాంతి లోపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన మహోద్యమం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడిపోతున్నారని బండి సంజయ్ అన్నారు. కాలేజీ యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు ముసుకునే దుస్థితి వచ్చిందని.. దీంతో ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని చెప్పారు. సంక్రాంతిలోపు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు.
అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటివరకు 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి.. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు.
యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని మాట తప్పిందన్నారు. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.48 వేలు బకాయి పడిందని.. బకాయి పడ్డ ఆ డబ్బును వెంటనే నిరుద్యోగులకు ఇవ్వాలని సూచించారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటు అని బండి సంజయ్ విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ రబ్బర్ స్టాంప్గా మార్చేసిందని ఆరోపించారు. అలాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజాప్రతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే.. ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపివేసి మన్మోహన్ను దారుణంగా అవమానించారని అన్నారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు సిద్ధమైందని తెలిపారు. మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి.. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు.