Amit Shah | ఖమ్మం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిత్యం జై శ్రీరాం అంటూ నినదించే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాద్రి రామయ్య దర్శనానికి వెనుకడుగు వేశారు. తన భద్రాచలం పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో రాముడిపై భక్తి ఇదేనా? అంటూ ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రామ రామ.. అంటూ రామయ్యను దర్శించుకోరా? అని నిలదీస్తున్నారు. హోంమంత్రి అమిత్షా ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి భద్రాచలం వచ్చి అక్కడినుంచి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ, భద్రాచలం పర్యటన శనివారం సాయంత్రం రద్దయినట్టు యంత్రాంగం ప్రకటించింది. కేవలం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మాత్రమే కేంద్రమంత్రి హాజరవుతున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు కూడా నిరాశకు గురయ్యారు. గతంలో రెండుసార్లు అమిత్షా ఖమ్మం పర్యటన వాయిదా పడింది. మూడోసారి పర్యటన ఖరారై కూడా భద్రాచలం పర్యటన రద్దుకావడంపై ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి.
నిత్యం ‘జై శ్రీరామ్..’ అంటూ స్తుతించే బీజేపీ నేత ఖమ్మం దాకా వచ్చి భద్రాచలం రామయ్యను దర్శించుకోకపోవడాన్ని పలాయనవాదంగా రాజకీయవిశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. భద్రాచలంలో గోదావరిపై రెండో బ్రిడ్జి పనులు, వరద ముంపు, కొవ్వూరు రైల్వేలైన్, రాష్ట్ర విభజన హామీలు, విలీన మండలాలు, విలీన పంచాయతీల సమస్యలపై ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే అమిత్ షా పర్యటనను రద్దు చేసుకున్నారనే చర్చ నడుస్తున్నది. భద్రాచలం ముంపు గ్రామాల ప్రజలు వరదసాయంపై నిలదీస్తారని భద్రాచలం పర్యటనపై వెనుకంజ వేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.