నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల పర్యటనతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒనగూరిందేమీ లేదు. పైసలమంత్రి పర్యటించినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు దక్కిన ఫాయి దా కూడా ఏమీ లేదు. ఈ నెల 1 నుంచి నుంచి 3వ తేదీ వరకు మూడురోజులపాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరుసగా బీజేపీ కార్యక్రమాల్లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఒకటీరెండు చోట్ల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా.. మొత్తంగా పార్టీ కేంద్రంగానే ఆమె పర్యటన సాగింది. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో లోక్సభ ప్రవాస్ యోజన పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి జిల్లాలో మూ డురోజులు పర్యటిస్తున్నందున కొత్తగా వరాలేవైనా ప్రకటిస్తారేమోనని జిల్లావాసులు ఎదురుచూశారు. అయితే రాష్ర్టానికి గానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు గానీ లాభం చేకూర్చే చిన్న ప్రకటన కూడా ఆమె నుంచి వెలువడలేదు. పైగా ఫక్తు రాజకీయమే ఎజెండాగా పెట్టుకుని మూడు రోజులపాటు నానా హడావుడి చేశారు. పదే పదే తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడానికి నిర్మల ప్రయత్నించారు.
మూడురోజుల్లో కేంద్రమంత్రి ఎక్కువగా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని, రుద్రూర్, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లోనే పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా అభివృద్ధి చేసి చూపించారు. కామారెడ్డి నుంచి బాన్సువాడకు, బాన్సువాడ నుంచి బీర్కూర్ మీదుగా కోటగిరికి వెళ్లిన ప్రధాన రహదారికి ఇరువైపులా వేలాది డబుల్ బెడ్ రూం ఇండ్లు కేంద్రమంత్రికి స్వాగతం పలికాయి. అందులో నివసిస్తున్న కుటుంబాలను దారిపొడవునా కారులోనుంచే నిర్మల స్వయంగా చూశారు. పచ్చని పంట పొలాలు, ఏపుగా ఎదిగిన హరితహారం మొక్కలు, ఊరి అవతల పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, బాన్సువాడ పట్టణంలోని విశాలమైన రహదారులు, సెంట్రల్లైటింగ్ ఒకటేమిటి అడుగడుగునా అభివృద్ధిని తిలకించిన కేంద్రమంత్రి.. బయటకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడానికే ప్రయత్నించారు.
కేంద్రంలోని మంత్రులంతా ప్రధాని మోదీనే అచ్చంగా ఫాలో అవుతున్నారు. తమ నాయకుడి అడుగు జాడల్లో నడుస్తూ ఫక్తు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2014 నుంచి 2022 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ర్టానికి ఏడుసార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ మొండిచేయి చూపడం మినహా ఏనాడూ కొత్తగా వరాలివ్వలేదు. కొత్త ప్రాజెక్టు మంజూరు చేసిందీ లేదు. ఉన్నవాటికి నిధులు ప్రకటించిందీ లేదు. మూడురోజుల నిర్మల పర్యటన కూడా అలాగే సాగింది. కేంద్రంలో కీలకమైన శాఖకు మంత్రిగా, దేశ ఆర్థిక వ్యవస్థకు సారథిగా ఉండి కూడా జిల్లాలో కేవలం ప్రవచనాలకే పరిమితమయ్యారు. తన పర్యటనలో ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకూ కేంద్రమంత్రి సుముఖత చూపలేదు. కామారెడ్డి పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ పలు స్వచ్ఛందసంస్థలు, పుర ప్రముఖులు ఆర్థికమంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పట్టణాల అభివృద్ధి, దవాఖానల ఉన్నతీకరణ, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధుల మంజూరు కోసం వినతులు సమర్పించేందుకు ఆసక్తి చూపారు. వారందరికీ అపాయింట్మెంట్ కూడా దొరుకలేదు.