కశ్మీర్ మండుతున్నది.. ఇది నెహ్రూ చేసిన పాపం..
దేశంలో విద్వేషాలు పెరుగుతున్నాయి.. ఇది ఒక మతం పాపం
మేకిన్ ఇండియా విఫలమైంది.. అది పెట్టుబడిదారుల పాపం..
నిరుద్యోగం పెరిగిపోయింది… అది పకోడీలు వేయలేని వారి పాపం..
ఆకలి సూచీలో భారత్ దిగజారింది.. నివేదిక రాసిన వాళ్ల పాపం..
తెలంగాణలో వడ్లను కొనడం లేదు.. అది పండించిన రైతుల పాపం..
యాసంగి బాయిల్డ్ రైస్ ఏం చేయాలి.. నూకలు తినలేని వాళ్ల పాపం..
మోదీ సర్కారు ‘పాపాల జాబితా’కు పరాకాష్ట లాంటి మరో పాపాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయటపెట్టారు. రూపాయి విలువ దారుణంగా పడిపోవటంపై ఆమె వింత వ్యాఖ్యానం చేశారు. అదేమిటంటే.. రూపాయి విలువ పతనం.. అది డాలర్ చేసిన పాపం..
అప్పుడెప్పుడో.. విద్యార్థులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. చలికాలంలో గతంలో కంటే.. ఈసారి చలి పెరిగిందయ్యా అని అడిగితే.. చలి పెరగలేదు.. చలిని తట్టుకొనే శక్తి మీలో సన్నగిల్లింది అని అన్నారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి వ్యాఖ్యలే ఇంత అద్భుతంగా ఉంటే.. వారి దగ్గర పనిచేసే మంత్రుల సంగతి చెప్పేదేమున్నది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పెద్ద జోక్గా మారిపోయింది. రూపాయి విలువ పతనానికి కొత్త భాష్యం చెప్పిన నిర్మలకు నోబెల్ ఆర్థిక పురస్కారమివ్వాలని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోయింది? కారణమెవరు.. కారకులెవరు? నిజానికి డాలర్ బలపడిందా? రూపాయి పడిపోయిందా? నిర్మల వ్యాఖ్యల్లోని ఔచిత్యానౌచిత్యాలపై..
ప్రఖ్యాత ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డీ పాపారావు రాసిన విశ్లేషణాత్మక కథనం..
డాలర్ బలపడటం వల్లనే రూపాయి బలహీన పడుతున్నదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు, తన ఆర్థిక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి, కాచి వడపోసి సెలవిచ్చారు. కాగా, ఇది ఏ ఆర్థిక శాస్త్ర పాండిత్యం లేని జన సామాన్యానికి కూడా తెలిసిన విషయమే. అలాగే, వివిధ దేశాల కరెన్సీల విలువలు నేడు, ఆయా దేశాల కరెన్సీలకు ఉన్న డిమాండ్ పైనే ఆధారపడి ఉంటాయనేది కూడా ఆర్థిక రంగాన్ని గమనించేవారందరికీ తెలిసిందే.
రూపాయి విలువ గనక డాలర్తో పోల్చితే 5 శాతం పతనం అయితే దాని వల్ల దేశంలో ద్రవ్యోల్బణం 0.2 శాతం మేరకు పెరుగుతుంది. ప్రభుత్వ విధానాలు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ రూపాయి విలువను దిగజార్చుతూ ప్రజల జీవితాన్ని ధరలకు బలిస్తున్నాయి. అసలు కారణాలు ఇవి కాగా.. డాలర్ పెరిగితే రూపాయి తగ్గుతోందంటూ- ఆడలేక మద్దెలోడు కథలు చెప్తోన్న నిర్మలా సీతారామన్ గారి, నిజాలు చెప్పలేని అశక్తత కప్పిపెడుతోన్న అసలు నిజాలు ఎన్నో.
ఈ రెండు పార్టీలు లేదా కూటములు కూడా సంస్కరణల పేరిట గత 30 సంవత్సరాలుగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని అందమైన మాటలతో కప్పిపెడుతూ వచ్చాయి. అలాగే.. కార్పొరేట్ల లాభాలను పెంచేందుకు.. దేశీయ వ్యవసాయాన్ని బలిపీఠం ఎక్కించాయి. ఈ విధానాలు మారకుండా దేశ ఆర్థిక వ్యవస్థలోని అష్టావక్ర స్వభావం, లోపాలు పరిష్కారం కావు.
ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేని కాలంలో అంటే.. మార్కెట్లో డిమాండ్ లేని కాలంలో కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, వారి నుంచి కొత్త పెట్టుబడులను ఆశించడం తల్లకిందుల ఆలోచన అని ఆమె గమనించలేకపోతున్నారు. ఫలితంగానే దేశంలో డిమాండ్ లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మన దేశం తాలూకు స్థానం ప్రపంచంలో పదవదిగా మిగిలిపోయింది. మేకిన్ ఇండియా విఫలమైన సంగతి మన కళ్ల ముందు కనపడుతున్నదే. ఆ పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్లు కార్పొరేట్లకు పన్ను రాయితీగా నజరానా ఇచ్చుకొన్నది.
ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న – డాలర్ మారకంలో మన రూపాయి పతనానికి కారణం అయిన రూపాయి కరెన్సీకి డిమాండ్ లేకపోవడం అనేది ఎందుకు జరుగుతున్నది అనేదే.. ఈ ప్రశ్నను ఎదుర్కొనే, దానికి జవాబు చెప్పే ధైర్యం, నిజాయితీ లేని మన ఆర్థిక మంత్రివర్యులు – ఆ ప్రశ్ననే దాటవేసే డొంకతిరుగుడు జవాబు చెప్పి తప్పుకొన్నారు. మరి ఆమె చెప్పిన ఈ జవాబు ఇక్కడ మన ముందర మరో ప్రశ్నను లేవనెత్తుతున్నది. అది, 2013లో (పాత) రికార్డు స్థాయి రూపాయి విలువ పతనం (డాలర్ తో పోల్చితే సుమారుగా రూ.68 పరిధి) గురించినది. 2014 ఎన్నికల క్రమంలో మోదీ గారు నాటి రూక పతనం గురించి చేసిన హడావుడి తెలిసిందే. ఆ పతనాన్ని ఆయన యూపీఏ ప్రభుత్వం తాలూకు చేతగానితనంగా, నిర్వాకంగా దుయ్యబట్టారు. మరి ప్రస్తుత నిర్మలా సీతారామన్గారి తర్కం ప్రకారం చూస్తే – నాడు మోదీగారి ఆగ్రహానికి కారణమైన రూపాయి పతనం కూడా ‘కేవలం’ డాలర్ పెరుగుదల తాలూకు ఫలితమేనని సరిపెట్టుకోవాల్సింది.
మరి నేడు.. రూపాయి విలువ, డాలర్తో పోల్చితే మరో కొత్త రికార్డు అయిన రూ.82 ను దాటిపోతోంది. అంతిమంగా తేలేది ఏమిటంటే – అది యూపీఏ అయినా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అయినా రూపాయి గతి అధోగతేననేది! రూపాయి.. ఆ మాటకొస్తే ఏ దేశ కరెన్సీ విలువ అయినా.. ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుందనేదానిని మనం ఇక్కడ పరిశీలిస్తే.. యూపీఏ, ఎన్డీయే పాలకుల తాలూకూ ఏ విధాన లోపాలు – నాడు, నేడు రూపాయి పతనానికి కారణం అవుతున్నాయనేది అర్థమవుతుంది. నిజానికి రూపాయి విలువను నిర్ణయించేది- అటు డాలర్ బలంతోపాటు ఇటు మన రూపాయి బలం కూడా. అంటే.. అటు అమెరికా, ఇటు భారత దేశాల ఆర్థిక వ్యవస్థల తాలూకు బలాబలాలు స్థూలంగా ఈ రెండు దేశాల కరెన్సీల మధ్యన ఉన్న సంబంధాన్ని, సాపేక్షతను నిర్ణయిస్తాయి.
డాలర్ అనేది అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ అన్నది నిజం. అది ఆ కరెన్సీ తాలూకు బలానికి కేంద్ర బిందువుగా ఉన్న అంశం. అలాగే అనేక రకాలుగా దెబ్బతిన్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ నేటికీ ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్వవస్థ కావడం దాని కరెన్సీ బలానికి మూలం. మరి మన దేశ రూపాయి విలువ కూడా డాలర్తో పోల్చితే ఏ స్థాయిలో ఉండగలదన్నది – మన దేశం తాలూకూ ఆర్థిక వ్యవస్థలోని బలాబలాలపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ అంశమే రూపాయి బలం తాలుకు అసలు కేంద్ర బిందువు. అంటే.. అంతర్జాతీయ, జాతీయ కారణాలు కలగలిసి వివిధ దేశాల కరెన్సీల విలువలను నిర్ణయిస్తాయి. అయితే.. ఈ విషయంలో ఒక దేశంలోని అంతర్గత బలం లేదా బలహీనతలదే పెద్ద పాత్ర.
అంటే.. నేటి మన రూపాయి విలువ దిగజారుతోందంటే – దాని వెనుకన మన ఆర్థిక వ్యవస్థ తాలూకు అనేకానేక బలహీనతలు కారణంగా ఉన్నాయి. ఏ దేశ కరెన్సీకయినా డిమాండ్ బాగా ఉండి, ఆ కరెన్సీ బలంగా ఉండాలంటే దాని వెనుకన ఉండాల్సిన ఆ దేశానికి సంబంధించిన అంతర్గత అంశాలుగా ఇలాంటివి ఉంటాయి: 1) ఆ దేశ కేంద్ర బ్యాంకు నిర్దేశించే వడ్డీరేట్ల స్థాయి. 2) ద్రవ్యోల్బణం. 3) ఆ దేశ ప్రభుత్వపు అప్పులు. 4) ఆర్థిక వృద్ధిరేటు. 5) ఆ దేశం తాలూకు విదేశీ వాణిజ్య సమతుల్యత వంటివి.
పై కారణాలను ఒక్కొక్కటిగా పట్టిచూస్తే.. నేడు మన రూపాయికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎందుకు తగ్గిపోతున్నదో, దాని విలువ ఎందుకు పతనం అవుతోందో అర్థం అవుతుంది. దీనిలో ముందుగా కాసేపు వడ్డీరేట్ల అంశాన్ని పక్కన పెడదాం. పైన పేర్కొన్న మిగతా అంశాల వరుస క్రమంలో చూస్తే.. నేడు మన దేశంలో కూడా ద్రవ్యోల్బణం పెద్ద స్థాయిలోనే ఉంది. సెప్టెంబర్ 2022లో ఇది 7.41 శాతంగా ఉంది. కాగా ఈ సంఖ్య ఆగస్టు మాసంలో 7 శాతంగా ఉంది. గత అనేక మాసాలుగా ఈ 7 శాతం చుట్టుపక్కల పరిధిలోనే ఈ సంఖ్య ఉంది. మరి దేశంలో ద్రవ్యోల్బణం ఇంత స్థాయిలో ఉండటం అంటే దీనికి కేవలం – రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంతర్జాతీయ కారణాలే ఉన్నాయా అని అంటే.. కచ్చితంగా లేదనేది నిజం. నేడు మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల వెనుక పాలక బీజేపీ నిర్వాకాలు, విధానాలే ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ప్రభుత్వ విధానాల తాలూకు అనేకానేక లోపాలు నేడు రూపాయికి శాపంగా పరిణమించాయి. కాబట్టి రూపాయికి ఏర్పడ్డ ఈ బలహీనతలే రెండో పక్కన ఎంతో కొంత మేరకు డాలర్కు రూపాయిపై మరింతగా ఆధిపత్యాన్ని ధారాదత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో గమనించాల్సిన విషయం రూపాయి పతనంతో దేశ ప్రజల జీవితంలో నెలకొంటున్న సమస్యలు. ఉదాహరణకు.. రూపీ విలువను డాలర్తో పోల్చితే 5% పతనం అయితే దాని వల్ల దేశంలో ద్రవ్యోల్బణం 0.2 % మేర పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ విధానాలు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ రూపాయి విలువను దిగజార్చుతూ ప్రజల జీవితాన్ని ధరలకు బలిస్తున్నాయి. అసలు కారణాలు ఇవి కాగా.. డాలర్ పెరిగితే రూపాయి తగ్గుతున్నదంటూ- ఆడలేక మద్దెలోడు కథలు చెప్తోన్న నిర్మల గారి, నిజాలు చెప్పలేని అశక్తత కప్పిపెడుతోన్న అసలు నిజాలు ఎన్నో.
ఆ నిజాలలో భాగమే – అటు యూపీఏ, ఇటు ఎన్డీయేలు అనుసరించిన ఆర్థిక విధానాల తాలూకు కార్పొరేట్ల అనుకూలత, రైతాంగం – గ్రామీణ ప్రాంత వ్యతిరేకత అన్నవి. ఈ రెండు పార్టీలు లేదా కూటములు కూడా సంస్కరణల పేరిట గత 30 సంవత్సరాలుగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని అందమైన మాటలతో కప్పిపెడుతూ వచ్చాయి. అలాగే.. కార్పొరేట్ల లాభాలను పెంచేందుకు.. దేశీయ వ్యవసాయాన్ని బలిపీఠం ఎక్కించాయి. ఈ విధానాలు మారకుండా దేశ ఆర్థిక వ్యవస్థలోని అష్టావక్ర స్వభావం, లోపాలు పరిష్కారం కావు.
మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో పారిశ్రామిక వృద్ధి కోసం అంటూ ముందుకు తెచ్చిన ‘మేకిన్ ఇండియా’ విఫలం అయిన సంగతి మన కళ్ల ముందు కనబడుతున్నదే. కాగా, మేకిన్ ఇండియా పేరు చెప్పి మోదీ ప్రభుత్వం 2019లో కార్పొరేట్ ట్యాక్స్ను సుమారు 10 శాతం మేరకు భారీగా తగ్గించేసింది. ఆ మేరకు సాలీనా రూ.1.45 లక్షల కోట్ల మేరకు కార్పొరేట్లకు పన్ను రాయితీగా నజరానా ఇచ్చుకున్నది. అలాగే.. అనేకానేక రాయితీలను కార్పొరేట్లకు ఇస్తూ పోయి.. నేడు ‘ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్’ పేరిట కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తోంది. కాగా, ఇంత చేసినా కార్పొరేట్లలో మాత్రం కదలిక ఏమీ లేదు.
ఈ రాయితీలను అందుకుని అవి ఏమీ కొత్త పెట్టుబడులు పెట్టడం లేదు. ఈ విషయమై సుమారుగా ఒక నెల రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుకున్నారు కూడా. మా ప్రభుత్వం మీకు ఇంతింతగా ఎదురు సేవలు చేస్తోన్నా మీరు (ప్రైవేట్ పెట్టుబడిదారులు) పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు? హనుమంతుడికి లాగా మీకు కూడా మీ శక్తిని మేము గుర్తుచేయాలా? అంటూ ఆమె వాపోయారు. ఇదీ విషయం. తాను, తన ప్రభుత్వం గుర్రానికి ముందర బండిని కట్టామని.. ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేని కాలంలో అంటే..
మార్కెట్లో డిమాండ్ లేని కాలంలో కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, వారి నుంచి కొత్త పెట్టుబడులను ఆశించడం తల్లకిందుల ఆలోచన అని ఆమె గమనించలేక పోతున్నారు. ఫలితంగానే దేశంలో డిమాండ్ లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మన దేశం తాలూకు స్థానం ప్రపంచంలో పదవదిగా మిగిలిపోయింది. అలాగే భారతీయ కంపెనీలు కొత్త ప్రాజెక్టులలో పెడుతున్న పెట్టుబడులు 25 శాతం మేరకు పడిపోయాయి. ఇటువంటి విధానాల వల్ల దేశంలో వృద్ధిరేటు మందగించి.. ఫలితంగా అనేకానేక ఇతర ఆర్థిక దుష్పరిణామాలు ఏర్పడి, అది రూపాయి విలువ పతనం వెనుక ప్రధాన కారణంగా ఉంది.
దేశాన్ని ముందుకు నడిపించే ఆర్థిక వృద్ధిని సాధించే మరో మార్గంగా నిన్నటికి నిన్న సేవారంగాన్ని చూపిస్తూ రఘురాం రాజన్ వ్యాఖ్యానించి ఉన్నారు. అయితే.. నిజానికి సేవారంగం అంటే.. ముఖ్యంగా మన దేశంలో అది ఐటీ లేదా ఐటీ ఆధారిత సేవల రంగంగానే ఉంటుంది. ఈ రంగం తాలూకు పరిస్థితి అది విదేశాల నుంచి, ముఖ్యంగా ధనిక దేశాల నుంచి సంపాదించుకునే కాంట్రాక్ట్లపై, ప్రాజెక్టులపై ఆధారపడి ఉంటుంది. నేడు తక్షణం యూ రోప్లోనూ, రానున్న కాలంలో అమెరికాలో ఏర్పడిన, ఏర్పడనున్న మాంద్యం పరిస్థితుల దృష్ట్యా.. ఆ యా దేశాల్లో కార్పొరేట్లు తమతమ ఐటీ బడ్జెట్లను తగ్గిస్తున్నాయి. ఇది ముందుముందు మరింతగా పెరిగిపోబోతోన్న పరిణామమే. ఈ దృష్ట్యా నేడు మన దేశానికి, తద్వారా మన రూపాయికి కూడా సేవారంగ ఆధారిత బలం ఏర్పరుచుకోగలగటం సాధ్యం కాదు.
అటు మన పాలకులు, ఇటు రఘురాం రాజన్ చెప్పనిది… వక్కాణించనది- వ్యవసాయరంగ ఆధారిత ముందడుగూ, పురోగమనం. మన దేశానికి గత అనేక దశాబ్దాలుగా పురోగమనానికి ఉన్న ఏకైక, అతిపెద్ద, ఆధారపడదగిన మార్గాంతరం వ్యవసాయ రంగమే. ప్రస్తుతం మన దేశ జనాభాలోని సుమారు 55-60% మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఈ రంగాన్ని లాభసాటిగా చేయగలిగితే అది దేశంలోని మెజారిటీ జనాల కొనుగోలు శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం వ్యవసాయరంగం నిర్లక్ష్యంపాలై ఉంది. దీని కారణంగానే సంస్కరణలు మొదలైన తర్వాత 1995 అనంతరం లక్షలాదిగా దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
దీనంతటికీ కారణం సంస్కరణల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అమలు జరిపిన, జరుపుతోన్న విధానాల సారం- కార్పొరేట్ల అనుకూలత.. రైతాంగ వ్యతిరేకత! దీనికి కారణం ఒక్కటే- నగర ప్రాంత కార్పొరేట్ల లాభాలు బాగా ఉండాలంటే దానికి- కార్మికుల, ఉద్యోగుల వేతనాలు తక్కువగా ఉండాలి. ఈ స్థితిని సాధించాలంటే కావాల్సింది- నగర ప్రాంతాలకు భారీగా కార్మికుల వలసలు ఉండటం. అది జరిగితేనే ఉపాధి కోసం పోటీ పెరిగి వేతనాల స్థాయి పడిపోతుంది. ఇదే జరగాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వలసలు ఉండాలి. దీనికోసం వ్యవసాయ రంగాన్ని లాభసాటి స్థితిలో ఉండనీయరాదు. అలాగనక ఉంటే.. గ్రామీణ రైతాంగం, వారి పిల్లలు నగర ప్రాంతాల్లో పని వెతుక్కుంటూ వలసలు రారు.
కాబట్టి వ్యవసాయం కడగండ్లలో ఉంటేనే నగర ప్రాంత కార్పొరేట్లకు కావాల్సిన చౌక శ్రమశక్తి దొరుకుతుంది. ఇక రెండోది.. నగర ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండవలసిన అగత్యం. కార్పొరేట్లకు ఇది అవసరం. ఎందుకంటే ఆహార పదార్థాల ధరలు అధిక స్థాయిలో ఉంటే నగరాల్లోని ఉద్యోగులు, కార్మికుల నుంచి వేతనాల పెంపుదల కోసం పారిశ్రామిక అధిపతులపై ఒత్తిడి వస్తుంది. దాని వలన వారికి వేతనాల రూపంలో వ్యయాలు పెరుగుతాయి. ఇది జరగకూడదంటే- గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువ స్థాయిలో ఉండాలి. అప్పుడే అవి నగర ప్రాంతాల్లో సాధ్యమైనంత తక్కువ ధరకు దొరుకుతాయి (మధ్య దళారుల పాత్రను కాసేపు పక్కనబెడితే). అదీ విషయం. ఏ విధంగా చూసినా నగర ప్రాంత కార్పొరేట్ల లాభాలు పెరగాలంటే గ్రామీణ ప్రాంతాలను పిండేయటమే సంస్కరణల సారం.
నేడు దేశంలో ఆర్థిక వృద్ధి ఉండాలన్నా, ప్రజల జీవితాలు బాగుండాలన్నా, రూపాయి బలంగా ఉండాలన్నా – దానికి ఉన్న ఒకే ఒక్క దారి గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం. దీని వలన నగర ప్రాంతాలకు కూడా మంచే జరుగుతుంది. ఉదాహరణకు.. కొద్ది సంవత్సరాల క్రితం నాటి నిజామాబాద్ జిల్లాలో ఒక సీజన్లో పసుపు పంట రికార్డు స్థాయిలో పండింది. ఆ పంటకు రికార్డు ధర కూడా పలికింది. దాంతో అక్కడి రైతాంగం నాడు అనేక మంది – కార్లు, ద్విచక్రవాహనాలు వంటివి కొనుగోలు చేశారు… ఇల్లు కట్టుకున్నారు. గృహోపకరణాలు కొనుక్కున్నారు. ఈ ముందుచెప్పిన కార్లు, గృహోపకరణాలు అలాగే ఇల్లు కట్టుకోవడానికి వాడే స్టీలు, సిమెంటు వంటివన్నీ నగర ప్రాంత పరిశ్రమల నుంచే వస్తాయి. అంటే.. గ్రామీణ ప్రాంతాలు సమృద్ధిగా ఉంటే అది నగర ప్రాంత పారిశ్రామిక వృద్ధికి.. ఉపాధి కల్పనకు కూడా మార్గం. పైగా ఇది మన చేతిలో ఉన్న పని. స్వయంగా మన దేశంలోనే మనం ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకునే దారి ఇది.
నేడు తెలంగాణలో ప్రభుత్వం ఈ వ్యవసాయ రంగం తాలూకు మొదటి అంచున తన శాయశక్తులా రైతాంగానికి అండగా నిలుస్తోంది. అంటే.. ఉత్పాదకాలను కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయంగా ‘రైతుబంధు’ను అందిస్తోంది. అలాగే ఉచిత విద్యుత్తు కూడా. ఇక ఇటువంటి విధానం దేశవ్యాప్తం కావాలి. అలాగే రెండో అంచున అంటే.. రైతు పంటను ఉత్పత్తి చేసిన తర్వాత కావాల్సిన గిట్టుబాటు ధరను కల్పించడం కేంద్రం పరిధిలోని అంశం. ఈ అంశంపై బీజేపీ మోసపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా రైతాంగానికి అశనిపాతంగా ఉంది. ఇది మారకుండా రైతాంగ జీవితాలు మారవు. అది జరక్కుంటే దేశం తలరాత మారదు. ఆర్థిక దిగజారుడు ఆగదు. రూపాయి పతనం మరింతగా జరిగే తీరుతుంది. కాబట్టి నిర్మలా సీతారామన్గారి, ఆమె ప్రభుత్వం తాలూకు పరిమితులను మింగలేక..కక్కలేక ఆమె డాలర్పై భారం.. నింద వేసి తప్పుకున్నారు. పాపం శమించుగాక..!!
అంతేకాకుండా ప్రస్తుత కాలంలో దేశీయంగా సరుకు ఉత్పత్తి రంగంలో ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు విఫలయత్నాలుగానే ఉంటాయనేది ఇప్పటివరకు కనబడిన వాస్తవం. 2008 అనంతరం ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం స్థితి.. మన దేశంలోనూ ప్రజల కొనుగోలు శక్తి అంతంత మాత్రంగానే ఉండటం.. అలాగే మన దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలను స్థాపించేందుకు ఎవరైనా ముందుకు రావాలన్నా- దానికి తగిన స్థాయి నిపుణతలు ఉన్న మానవ వనరుల కొరత ఉండటం వంటివి అనేకానేకం నేడు మన దేశంలో పారిశ్రామిక వృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని గతంలో మేకిన్ ఇండియాను 2014 సెప్టెంబర్లో ప్రారంభించినప్పుడు నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కూడా చెప్పి ఉన్నారు.
నేడు దేశంలో ఆర్థిక వృద్ధి ఉండాలన్నా, ప్రజల జీవితాలు బాగుండాలన్నా, రూపాయి బలంగా ఉండాలన్నా – దానికి ఉన్న ఒకే ఒక్క దారి గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం. దీని వలన నగర ప్రాంతాలకు కూడా మంచే జరుగుతుంది.
1. ధరల పెరుగుదల-రూపాయి పతనం
మన దేశం వ్యవసాయపరంగా స్వయం సమృద్ధిని సాధించింది. గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలో మనది రెండో స్థానం. కాగా నేడు ఒక్క సంవత్సర కాలంలో గోధుమల రిటెయిల్ ధర 12 శాతంపైగా పెరిగిపోయింది. అలాగే.. గత కొద్ది మాసాలుగా దేశంలో బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. మన ప్రజలందరికీ కావాల్సిన స్థాయిలో ఈ ధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నట్టు? దీనికి కారణం విదేశీ మారక ద్రవ్యం కోసం కక్కుర్తిపడి మన కేంద్రంలోని బీజేపీ పాలకులు – గత అనేక మాసాలుగా బియ్యం, గోధుమలను రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తూ పోవడం.
దీనివల్ల నేడు మన దేశంలో భారత ఆహార సంస్థ వద్ద దేశ ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు లేని స్థితి ఏర్పడింది. అలాగే, గోధుమల సేకరణను కూడా పంట వచ్చే సీజన్లో కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. దీంతో పండిన పంటలో పెద్ద భాగం ప్రైవేట్ వ్యాపారుల పరం అయిపోయింది. వారు దీనిని లాభాల కోసం విదేశాలకు ఎగుమతి చేసుకొనే లేదా దేశంలోనే ధర పెరిగేదాకా కృత్రిమ కొరతను సృష్టించి – అలా పెరిగిన ధరకు అమ్ముకునే ప్రయత్నాలు చేయడం వలన నేడు ధాన్యం ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల పరోక్షంగా అయినా రూపాయి పతనం రూపంలో ప్రతిబింబిస్తోంది.
2. ద్రవ్యోల్బణం పెరుగుదల
ఈ మధ్యకాలంలో నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు, మక్కజొన్న, పాలు, పెరుగు, మజ్జిగ తదితరాలపై కూడా జీఎస్టీ వడ్డనతో ఈ ధరలు మరింత పెరిగిపోయాయి. అంటే.. ఆ మేరకు రూపాయి కొనుగోలు శక్తి తగ్గినట్టే. ఇక అలాగే.. పెట్రోల్, డీజిల్పై కొంత మేరకు తగ్గించామని చెప్పినా.. ఇప్పటికీ ఎక్సైజ్ సుంకం భారీగానే ఉండటం కూడా దేశంలో సరుకు రవాణా చార్జీల పెరుగుదల రూపంలో ద్రవ్యోల్బణానికి ఒక అతిపెద్ద కారణం అవుతున్నది.. ఇలా.. చెప్పుకుంటూ పోతే కేంద్రంలోని బీజేపీ నిర్వాకం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల అధికంగా ఉందనేది కనపడుతోంది. కాబట్టి రూపాయి విలువ తాలూకు మూలాలను తెగనరకడంలో బీజేపీ విధానాల తాలూకు అంశం కేంద్ర బిందువుగా ఉంది.
3. దేశీయ వృద్ధిరేటు క్షీణత
దేశీయ ఆర్థిక వృద్ధిరేటు. ప్రపంచంలోనే మన దేశ ఆర్థిక వృద్ధిరేటు అధికంగా ఉందంటూ కేంద్రంలోని బీజేపీ నేతలు పదే పదే డబ్బాలు కొట్టుకున్నారు. కానీ ఈ డబ్బాల మోత సద్దుమణగకముందే – అంతర్జాతీయ ద్రవ్యనిధి మన వృద్ధిరేటును (2023 ఆర్థిక సంవత్సరానికి) 7.4 శాతం నుంచి 6.8 శాతానికి కుదించింది. కాగా.. ఈ మధ్య కాలంలో అనేక దఫాలు, అనేక సంస్థలు 2023 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును తక్కువ స్థాయికి సవరిస్తూ అంచనాలను విడుదల చేశాయి. చివరికి 2023 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నికరంగా ఈ వృద్ధిరేటు ఎంత ఉంటుందనేది ఇప్పటికీ అగమ్యగోచరమే. అదీ పరిస్థితి. మరోప్రక్కన ఈ మధ్య వెలువడుతోన్న అనేకానేక ఇతర ఆర్థిక గణాంకాలు కూడా దేశ ఆర్థిక స్థితి నేల చూపులు చూస్తోందని నిర్ధారిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోకి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా మన రూకకు పదేపదే చావుదెబ్బలు తగులుతున్నాయి.
4. అత్యధిక రుణభారం
నిన్నగాక మొన్న వెలువడ్డ గణాంకాల ప్రకారం మన దేశ ప్రభుత్వ రుణ భారం దేశ జీడీపీలో 84 శాతంగా ఉన్నది. దీని ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యధిక రుణభారం ఉన్న దేశంగా భారతదేశమే ఉన్నది. అంతకుమించి, ప్రస్తుతం పెరిగిపోయిన ఈ రుణభారం వల్ల ముందు ముందు మన క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోవచ్చునని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు చెప్తున్నాయి. అదీ కథ! రూపాయి విలువ పతనానికి ఇదొక ప్రధాన కారణంగా ఉంది.
5. విదేశీ వాణిజ్యం.. దశాబ్దం వెనక్కి
మన దేశ విదేశీ వాణిజ్యానికి సంబంధించినది. ఈ విషయంలో మన పరిస్థితి మెల్లమెల్లగా 1991, 2013లను తలపించేదిగా మారుతోంది. 1991.. 2013ల్లో మన దేశ విదేశీ వాణిజ్య లోటు స్థూల జాతీయ ఉత్పత్తిలో 3 శాతం పరిధిలోకి చేరింది. ఈ క్రమంలోనే విదేశీ మారక ద్రవ్య సంక్షోభాలను నాడు మనం ఎదుర్కొన్నాం. నేడు మరలా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మన విదేశీ వాణిజ్యలోటు జీడీపీలో 2.8 శాతానికి చేరుకుంది. తొందరలోనే ఇది 3 శాతానికి చేరుతుందనేది కచ్చితమైన అంచనా. అంటే.. మరో దఫా మనం విదేశీ మారక సంక్షోభం అంచుకు చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది రూపాయి పతనానికి అతిపెద్ద కారణంగా ఉంది.. ఉండబోతోంది.
రూపాయి పడలె.. డాలరే లేచింది!
ఒక డాలర్=రూ.82.68 చేరుకోవటాన్ని రూపాయి విలువ పడిపోతున్నట్టుగా చూడటం లేదు. డాలర్ బలపడుతుండటంతో అలా అనిపిస్తున్నది.
-కేంద్ర మంత్రి నిర్మల
నిర్మలమ్మతో నెటిజన్ల చెడుగుడు..
నోబెల్ ఇవ్వాల్సిందే కరెన్సీ మారక విలువపై వినూత్నమైన థీసిస్కుగాను నిర్మల ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి అర్హులు. రూపాయి నష్టపోలేదు.. డాలరే బలపడింది.. ఇదీ సూత్రీకరణ!
– ప్రొఫెసర్ నాగేశ్వర్
నేనేమీ బరువు పెరగటం లేదు. గురుత్వా కర్షణ శక్తి ఎక్కువవటం వల్ల బరువు కొలిచే యంత్రం అలా చూపిస్తున్నది.
పాల ధరలు పెరగలేదు.. మీ కొనుగోలు శక్తి పెరగటంతో అలా అనిపిస్తున్నది.
భారత భూభాగం తగ్గటం లేదు.. చైనానే తన సరిహద్దును పెంచుకుంటూ పోతున్నది .
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు. కాంగ్రెస్ ఓడిపోయింది అంతే.
డీ పాపారావు,
ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు
9866179615