హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలో విద్యుత్తు వినియోగం బాగా పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా కొత్త బొగ్గు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా పేర్కొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో కొత్త బొగ్గు గనుల యాజమాన్యాలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశీయ బొగ్గు అవసరాలను తీర్చడం కోసం కొత్త గనులను తక్షణమే ప్రారంభించాలని, ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకుతో పాటు మిగిలిన కంపెనీలకు కేటాయించిన గనుల నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సంపూర్ణ సహకారం అందించాలని ఒడిశా ప్రభుత్వానికి సూచించారు.
సింగరేణికి కేటాయించిన నైనీ బ్లాకుకు అన్ని అనుమతులు లభించి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పర్యావరణ అటవీ శాఖ నుంచి పూర్తి సహకారం అందించి బొగ్గు ఉత్పత్తికి తోడ్పాటునందించాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాకు స్టేజ్-1, 2 అనుమతులు లభించాయని, బొగ్గు రవాణాకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుని బొగ్గు తవ్వకానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ఏడాది కనీసం 50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శులు వినీల్ కృష్ణ, కుట్టితో సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సమావేశమై నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించి సహకారాన్ని కోరారు. దీనిపై వారు స్పందిస్తూ.. సంపూర్ణ సహకారం అందించేలా జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. అలాగే నైనీ బ్లాక్ జీఎం, ఇతర అధికారులతోనూ శ్రీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.