హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మోటుమర్రి-విష్ణుపురం రైల్వేస్టేషన్ల మధ్య డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు. రూ.1746.20 కోట్ల అంచనాలతో ఆమోదం పొందిందని, 88.81 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు.
ఈ రైల్వే లైను నిర్మాణం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రజల అవసరాలు తీరుతాయని, సగటు రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్యాసింజర్ రైళ్ల సమయపాలనను మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ రైల్వేలైన్ తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాల మీదుగా 95 మండలాల్లో ఉంటుందని పేర్కొన్నారు.