ఇటీవల మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంపన్నులకు అనుకూలమైంది కాగా , రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ పేదలకు సంక్షేమాన్ని సమకూర్చేది. ఈ రెండింటిమధ్య వ్యత్యాసాన్ని అందుకు పునాదిగా ఉన్న దృక్కోణాలను ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పాపారావు వివరించారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించిన విశ్లేషణను ఈ మొదటిభాగంలో అందిస్తున్నాం.
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక… కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ… జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం. దేశం తాలూకూ ఈ స్థితినే ‘K’ తరహా ‘అభివృద్ధి’గా పిలుస్తున్నారు. అంటే ‘K’ అనే ఈ అక్షరం తాలూకూ పై గీత లాగే ధనవంతులు కూడా, పైకి… ఇంకా ఇంకా పైకి… అంతర్జాతీయ కుబేరుల జాబితాలోకి వెళ్తున్నారు. కాగా, పేద, సామాన్య, మధ్యతరగతి జనం ఈ ‘K’ అనే అక్షరంలోని కింది గీతలా… కిందికి… ఇంకా కిందికి నెట్టివేయ బడుతున్నారు.
ఈ ‘K’ తాలూకూ పై గీతకు ప్రాతినిధ్యం వహించే, అనుకూలించే సిద్ధాంతం 1980లలో ‘సప్లై సైడ్ ఎకనామిక్స్’ గా మొదలై నేడు ప్రపంచంలోని పలు దేశాలలో కార్పొరేట్లు, వారి కనుసన్నలలో నడిచే నాయకుల అభిమాన సిద్ధాంతంగా ‘విరాజిల్లుతోంది’. కాగా, 1980 దశకం ముందరి వరకూ అనేకానేక దేశాలలో సంక్షేమ రాజ్యాలుగా ‘K’ తాలూకూ కింది గీతకు… అంటే కార్మికులు, ఉద్యోగులు, సామాన్య జనానికి ప్రాతినిధ్యం వహించే ‘డిమాండ్ మేనేజ్మెంట్’ సిద్ధాంతానిది పై చేయిగా ఉంది. ఈ పై గీత… కింది గీతల తాలూకూ ఆలోచనా విధానంలో హస్తిమశకాంతరం తేడా ఉంది. సంక్షేమ రాజ్యాల డిమాండ్ మేనేజ్మెంట్ ప్రకారంగా… ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు… మాంద్యాలు… మంద గమనాలు లేకుండా సాఫీగా ఎదగాలంటే, కావల్సింది ఆ దేశంలోని సామాన్య జనం బాగుండడం. అంటే, వారికి తగిన ఉపాధి అవకాశాలు, అందుబాటులో ఉండే విద్యా, వైద్యాలు… రిటైరయ్యాక గడిపే జీవితానికి భరోసానిచ్చే పింఛన్లు, పొదుపు మొత్తాలు తదితరం. దీనంతటి కోసం కావల్సింది ప్రభుత్వాల చిత్తశుద్ధి. ఆర్థిక వ్యవస్థలో అవసరమైన మేర ప్రభుత్వ పాత్ర, అలాగే ఉద్యోగ భద్రతా, పని ప్రదేశపు హక్కులు, అవసరం పడినప్పుడు యజమానితో బేరసారాలు ఆడగలిగేందుకు కార్మికులు, ఉద్యోగులకు చట్టపరమైన హక్కులు, రక్షణలు ఇత్యాది. ఇటువంటి వ్యవస్థ సుమారుగా 1980 దశకం వరకు వివిధ దేశాలలో నడిచింది. 1950 ల నుంచి 1980ల వరకు నడిచిన ఈ సంక్షేమ రాజ్య కాలాన్నే పెట్టుబడి వ్యవస్థ తాలూకూ స్వర్ణయుగం అని పిలుచుకుంటున్నారు.
కాగా, ఈ స్వర్ణయుంపై పిశాచదాడి 1980ల తర్వాత మొదలైంది. బ్రిటన్లో మార్గరెట్ థాచర్, అమెరికాలో రొనాల్డ్ రీగన్లు సంక్షేమ రాజ్యాన్ని కూలదోసే సప్లై సైడ్ మేనేజ్మెంట్ సిద్ధాంతానికి ప్రతినిధులుగా పదవులు చేపట్టారు. తర్వాతి కాలమంతా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి వర్గంపై దాడుల పరంపరే. అంటే, గతంలోని ఉద్యోగ భద్రతలు, విద్య, వైద్యం వంటి సామాజిక సంరక్షణలు, యజమానితో బేరసారాలాడేందుకు ఉన్న కార్మిక సంఘాలు, రిటైర్మెంట్ రక్షణలు… ఇలా సమస్తం కూలదోయబడ్డాయి. అవుట్సోర్సింగ్, ఆటోమేషన్ కత్తులను కార్మికులు, ఉద్యోగులు, జన సామాన్యం నెత్తిమీద వేలాడదీసి వారి హక్కులను ‘సంస్కరణల’ పేరిట ఒక్కొక్కటిగా కొల్లగొట్టేశారు.
దీనిలో భాగమే వివిధ దేశాల వార్షిక బడ్జెట్లు కూడా..! దీనికి భారత్ కూడా మినహాయింపేమి కాదు. నిన్నటి యూపీఏ నుంచి నేటి ఎన్డీయే దాకా కథ అదే..!! తలకిందులైన సంక్షేమ రాజ్య కథను కాళ్ల కింద వేసి తొక్కుతూ అటు చిదంబరాలూ… ఇటు నిర్మలా సీతారామన్లు వేస్తున్న బడ్జెట్ల, అమలు చేస్తున్న ఆర్థిక విధానాల సారం పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే. దీనినే మోదీ భాషలో చెప్పాలంటే ‘రేవడి’ కల్చర్ లేదా… ఉచితాలు. అంటే, కార్పొరేట్ అనుకూల సప్లై సైడ్ ఆర్థిక శాస్త్రానికి అనుకూలంగా జనాన్ని కూడగట్టేందుకు, మధ్య తరగతి జనాన్ని రెచ్చగొట్టేందుకు మోదీ ముందుకు తెస్తున్నదే.
ఈ పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ‘ఉచితాలు’గా జనానికి పంచేయడంతోనే దేశానికి నష్టం జరుగుతుందనే సూత్రీకరణ. దీనిలో భాగంగానే 2023- 2024 కాలానికి గానూ సమర్పించిన తన ఆర్థిక బడ్జెట్లో, నిర్మలా సీతారామన్ దేశంలోని జన సామాన్యానికి ఇచ్చే రాయితీలు లేదా సంక్షేమ పథకాలలో రూ.1,58,995 కోట్ల మేరకు కోత కోసేశారు. అంటే, 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించిన మొత్తం రూ. 5,62,079 కోట్లు కాగా అది ప్రస్తుత 2023- 2024 బడ్జెట్లో రూ.4,03,084 కోట్లకు కుదించుకు పోయింది. ఎన్నికల సంవత్సరంలో కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా జన సామాన్యానికి వ్యతిరేకంగా పోవడానికి వెనుకాడని మోదీ తీరు ఈ సంక్షేమ కోతల్లో కనపడుతున్నది.
ఇక విడివిడిగా చూస్తే ఆహారం, ఎరువులు, ఇంధనం సబ్సిడీలకు కేటాయింపులను పరిశీలిస్తే జరిగిందీ… జరుగుతున్నదేమిటో మరింత ఇతిమత్థంగా మనకు కనపడుతుంది. ఈ మూడు అంశాలకు 2024 ఆర్థిక సంవత్సరానికి వేసిన ఈ బడ్జెట్ రూ.3.74 లక్షల కోట్లను కేటాయించింది. ఈ మొత్తం దీని ముందరి అంటే 2022- 2023 బడ్జెట్లో కంటే 28 శాతం మేర తక్కువగా ఉన్నది. అంటే, ఆహార సబ్సిడీ మీద 31శాతం, ఇంధన (వంట గ్యాస్) సబ్సిడీ మీద 75 శాతం, ఎరువుల మీద 22 శాతం మేర కోత పడింది. కాగా ఇక్కడ, నేడు మన దేశం అంతర్జాతీయ క్షుద్బాధితుల ర్యాంకులలో దిగజారిన విషయం చాలా మందికి తెలిసిందే. అలాగే, అనేక కుటుంబాలు పెరిగిపోయిన వంటగ్యాస్ ధర భరించలేక కట్టెల పొయ్యిలకు మరలిన, మరలుతోన్న స్థితి అనేకమందికి అర్థమయ్యిందే. ఇక, నేడు రైతాంగం పెరిగిపోయిన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల అంటే ఒక్క ముక్కలో ఉత్పాదకాల ధరలను భరించలేక ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచమనీ… అలాగే యూరియా, డీఏపీపై మరింత సబ్సిడీ కావాలని ఈ బడ్జెట్ రాకముందు అడుగుతూ ఉండడం సుపరిచితమే. విషయం అది కాగా, బడ్జెట్ ప్రయాణం మాత్రం దీనికి విరుద్ధ దిశలో… ఉన్న కాస్తంత రాయితీలకు కోత వేసే దిశలో సాగింది.
ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి కేటాయించిన మొత్తం ప్రస్తుత 2023-2024 బడ్జెట్లో, 13.33 శాతం కోతలతో 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి, అంటే రూ. 60 వేల కోట్లకు తగ్గించబడింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2022-2023) తాలూకూ బడ్జెట్ అంచనాలలో రూ.68 వేల కోట్లుగా నిర్ణయించారు. అలాగే, ఈ కేటాయింపులతో పాటుగా పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతాంగ కుటుంబాల సంఖ్యను కూడా కుదించేస్తున్నారు. 2018 డిసెంబర్లో ఈ పథకాన్ని 11.84 కోట్ల లబ్ధిదారులతో ప్రారంభించారు. కాగా, పథకం ఆరంభించిన 3 సంవత్సరాల తర్వాత అంటే, 2022 మే జూన్ నాటికి ఈ సంఖ్య 3.87 కోట్లకు పరిమితమైంది.
దీనితో పాటుగా జాతీయ ఉపాధి హామీ పథకానికి 33 శాతం మేర ఈ ప్రభుత్వం కేటాయింపులను భారీగా కోసేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం జాతీయ ఉపాధి హామీకి రూ. 89,400 కోట్లను కేటాయించారు. కాగా, నేటి 2023- 2024 బడ్జెట్లో ఈ కేటాయింపు రూ.60,000 కోట్లకు అంట కత్తెర వేయబడింది. అదేం అంటే, దేశంలో పరిస్థితులు పుంజుకున్నాయి… బాగున్నాయి.. ప్రస్తుతం ఉపాధి అడిగే కూలీల సంఖ్య బాగా తగ్గిపోయిందంటూ ప్రభుత్వం కనికట్టు కబుర్లు చెబుతున్నది. రెండో పక్కన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన స్థితి ఉన్నది. చివరికి చిన్న చిన్న ప్యాకెట్ల బిస్కెట్లో లేదా సబ్బులో లేదా మరో వినియోగ వస్తువో కొనుక్కొనే స్థోమత కూడా జన సామాన్యానికి లేకుండా పోయింది. ఈ సరుకులు అమ్ముకొనే కంపెనీల అమ్మకాలు, రాబడులు తగ్గిపోతుండడం కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సంస్థల అంచనాల ప్రకారం వాస్తవంలో జాతీయ ఉపాధి హామీ పథకం కోసం నేడు రూ. 2.72 లక్షల కోట్ల కేటాయింపు అవసరం అవుతుంది.
అంతిమంగా, మధ్య తరగతి ఉద్యోగ వర్గానికి అంటూ ఇచ్చిన పన్ను రాయితీలలో కూడా నిజాయితీ కనపడడం లేదంటూ నేడు అంకెలతో సహా పలు వివరణలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ కొత్త ఆదాయ పన్ను వ్యవస్థ తాలూకూ అసలు ఉద్దేశ్యం పన్ను చెల్లింపుదారులను పాత పన్ను వ్యవస్థ నుంచి ఈ కొత్త వ్యవస్థ దిశగా మళ్లించడమే అనేది ప్రధాన ఆరోపణ. అంటే, గతంలో పాత పన్ను వ్యవస్థలో పన్ను చెల్లింపు దారులను పొదుపు చేసే దిశగా, ఆ వ్యవస్థ ప్రోత్సహించగా ప్రస్తుత ఈ కొత్త పన్ను విధానం వారిని వినియోదారులుగా, జేబులో ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఖర్చులు చేసేవారీగా మార్చే ప్రయత్నం చేస్తున్నదనేది దేశ హితం కోరే ఆర్థిక వేత్తల వివరణ.
ఇది మన కేంద్ర బడ్జెట్- తనకు తానుగా తననొక ‘విభిన్నమైన రాజకీయ పక్షం’గా చెప్పుకొనే బీజేపీ ఆలోచనల అసలు స్వరూపం. ఇందులోని భిన్న త్వం… గతంలోని యూపీఏ ప్రభుత్వం తాలూకు ప్రజలు ఆగ్రహిస్తారనే శషభిషలూ… శంకలూ … శతవిధాలా భయాలు లేకపోవడమే. నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా పేదలపై భారాలు మోపుతూ… వారికి గతంలో కాస్తంత ఉన్న రాయితీలను కూడా ఊడబెరుకుతూ, ఎదురు తిరిగి ప్రశ్నిస్తే… ఏంటి ఇది? అంటే దేశ ద్రోహులు… ఆ దేశానికో, ఈ దేశానికో ఏజెంట్లు అంటూ అడ్డమైన ఆరోపణలు. నమ్మేవాడు ఉన్నంత కాలం… నడిచే నడమంత్రపు కథ ఇది…!
(ఇంకా ఉంది)
ఉపాధి హామీ పథకానికి 33 శాతం మేర ఈ ప్రభుత్వం కేటాయింపులను భారీగా కోసేసింది. 2023- 2024 బడ్జెట్లో కేటాయింపులో రూ.60,000 కోట్లకు అంట కత్తెర వేసింది. అదేం అంటే, దేశంలో పరిస్థితులు పుంజుకున్నాయి… బాగున్నాయి.. ప్రస్తుతం ఉపాధి అడిగే కూలీల సంఖ్య బాగా తగ్గిపోయిందంటూ ప్రభుత్వం కనికట్టు కబుర్లు చెబుతున్నది.
డీ పాపారావు 98661 79615