హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో పారిశ్రామికరంగం భవిష్యత్పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కొత్త ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెడుతుందా? ప్రస్తుత విధానాలనే కొనసాగిస్తుందా? అనే చర్చ పారిశ్రామికవర్గాల్లో జరుగుతున్నది. రాష్ర్టానికి ఉన్న భౌగోళిక అనుకూలతలకు తోడు కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా పారిశ్రామిక అనుకూల విధానాలను కొనసాగిస్తే పారిశ్రామిక ప్రగతికి ఢోకా ఉండదనేది పలువురి అభిప్రాయం. వ్యవసాయరంగం తరువాత అత్యధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేది పారిశ్రామికరంగం. వివిధ పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చేది కూడా ఈ రంగమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక అనుకూల విధానాలు, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు తోడు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ పనితీరు పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయి. సులభతర అనుమతుల కోసం టీఎస్-ఐపాస్ చట్టం తేవడంతోపాటు ఐటీ, ఔషధాలు, టెక్స్టైల్స్, ఆహారశుద్ధి, ఈవీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తదితర రంగాల్లో అనుసరించిన విధానాలు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాయి. తైవాన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, అమెరికా తదితర దేశాలకు చెందిన సంస్థలు హైదరాబాద్ శివార్లలో పరిశ్రమలను నెలకొల్పాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ అధిగమించింది.
ప్రభుత్వంతో చర్చలకు పారిశ్రామికవర్గాల సన్నాహాలు
కరోనా అనంతరం విదేశీ సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్పై ఆసక్తి ప్రదర్శిస్తున్న పరిశ్రమలను తెలంగాణకు వచ్చే విధంగా కేటీఆర్ తీవ్రంగా కృషిచేశారు. వివిధ రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాలకు దీటుగా రాయితీలను కల్పించడంతోపాటు వారిలో విశ్వాసం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరించడంతో పెట్టుబడిదారులు సైతం ఎప్పటికప్పుడు తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. కొత్త ప్రభుత్వం సైతం సానుకూల దృక్పథంతో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఢోకా ఉండదని పారిశ్రామికవర్గాలు భావిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ముఖ్యమంత్రిని, పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి చర్చించే యోచనలో పారిశ్రామికవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి వివరించాలని భావిస్తున్నట్టు సమాచారం.