Unemployment | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. ఇదే సమయంలో నిరుద్యోగం కూడా అదేస్థాయిలో కోరలు చాస్తున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘దేశంలో జనాభా పెరుగుతున్నట్టే పనిచేయగల వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే, దీనికి అనుగుణంగా ఉద్యోగ కల్పన జరుగట్లేదు’ అని పేర్కొన్నారు. గడిచిన ఐదేండ్లుగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పులేదని వెల్లడించారు. నైపుణ్యంతోకూడిన ఉద్యోగాల కల్పన రేటు అత్యంత తక్కువగా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు.
నిరుద్యోగిత రేటు పైపైకి
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాట తప్పింది. ఫలితంగా గతంలో ఎన్నడూ చూడని రీతిలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది. సీఎంఐఈ తాజా నివేదిక ప్రకారం.. మార్చిలో 7.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి ఎగబాకింది. గత డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరుగడం ఇదే తొలిసారి. గడిచిన నెల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 8.51 శాతం నుంచి 9.81 శాతానికి పెరగ్గా, గ్రామాల్లో ఇదే సమయంలో 7.47 శాతం నుంచి 7.34 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఇక దేశంలోని మొత్తం శ్రామికవర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగాలు కావాల్సినవారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ విషయంలో పొరుగుదేశాలు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కొంత మెరుగ్గా ఉన్నాయి. మొత్తం శ్రామికవర్గంలో బంగ్లాలో 54 శాతం మందికి, పాక్లో 48 శాతం మందికి ఉద్యోగాలు ఉన్నట్టు సమాచారం.