చిక్కడపల్లి, జూలై 4: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు శనివారం సాయంత్రం చిక్కడపల్లి సిటీసెంట్రల్ లైబ్రరీలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఐదు వేల ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు.
ఖాళీగా ఉన్న 19వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తాము ధర్నా చేస్తే.. ప్రభుత్వం మాత్రం 5 వేల పోస్టులు ఇవ్వడంపై మండిపడ్డారు. మొత్తం 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇ వ్వాలని పేర్కొన్నారు. కానిస్టేబుల్తోపాటు మెగా డీఎస్సీ, గ్రూప్ తదితర ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేశ్, రవి యాదవ్, వెంకట్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.