హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ): అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేండ్ల చిన్నారుల వరకు తక్కువ బరువు సమస్యగా మారుతున్నది. గర్భం దాల్చిన తర్వాత తల్లులకు పోషకాహారంపై సరైన అవగాహన లేకపోవడంతో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో 15 శాతం శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇందులో 25 శాతం మంది డయేరియా వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్టు వెల్లడైంది. నవజాత శిశువు నుంచి రెండేండ్ల చిన్నారుల పోషణ, గర్భిణుల ఆహారపు అలవాట్లను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఇటీవల అధ్యయనం చేసింది.
ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత సారథ్యంలో జరిగిన ఈ అధ్యయనంలో చిన్నారుల పోషణ కోసం పలు కీలకమైన సూచనలు అందజేశారు. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న బరువు సమస్యకు పరిష్కారంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక పాలసీని రూపొందించాల్సిన అవసరాన్ని ఎన్ఐఎన్ గుర్తు చేసింది. ప్రస్తుతం ఉన్న ఐసీడీఎస్ విధానాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తేల్చింది. గర్భిణుల కుంగుబాటుతో 20 శాతం శిశువుల బరువు తగ్గేందుకు కారణమవుతుండగా, 25 శాతం డయేరియా వంటి ఇన్ఫెక్షన్లు, 50-55 శాతం ఇతర ఫీడింగ్ విధానాలతో రెండేండ్లలోపు చిన్నారులు బరువు తగ్గుతున్నారని తేల్చింది.
ఆరునెలల వరకు తల్లిపాలతోనే శిశువు జీర్ణవ్యవస్థ, జీవక్రియలు మెరుగుపడుతాయి. ఈ కీలక సమయంలోనే ఎందరో తల్లిపాలకు దూరమవుతున్నట్టుగా తేలింది. ఆరు నెలల వయసు నుంచి 24 నెలల వరకు చిన్నారుల బరువు పెరిగేందుకు పోషకాలతో కూడిన ఆహారంతో పరిష్కారం దొరుకుతుందని ఎన్ఐఎన్ సూచించింది. పుట్టబోయే బిడ్డ పెరుగుదలకు గర్భిణులు తాము తీసుకునే దానికంటే 30 శాతం అధికంగా పోషకాలు తీసుకోవాలని పేర్కొన్నది.
ఆరోగ్యవంతమైన బరువుతో పిల్లలు జన్మించాలంటే.. గర్భం దాల్చక ముందు నుంచే స్త్రీలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్ఐఎన్ సూచించింది. వివాహానికి ముందు నిర్ణీత వయసు, బరువు ఉండి, రక్తహీనత, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నది. వీటితో పాటు సమతుల ఆహారం మంచి బరువున్న శిశువుకు జన్మనివ్వడానికి సాధ్యపడుతుందని గుర్తించారు. దీనికోసం జాతీయ స్థాయిలో గతంలో జరిగిన కుటుంబ, ఆరోగ్య సర్వే ఫలితాలను విశ్లేషించింది. 32 శాతం మహిళల ఎత్తు తక్కువగా ఉండటం, 6-24 నెలల వరకు జరిగే కాంప్లిమెంటరీ ఫీడింగ్ 90 శాతం మేర లేకపోవడమే చిన్నారుల్లో బరువు సమస్యలకు కారణాలుగా ఎన్ఐఎన్ తేల్చింది.