మేడ్చల్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పండుగలను రాష్ట్రమంతటా ఒకే రోజున నిర్వహించేందుకు పండితులు, సిద్ధాంతులు, ప్రముఖ దేవాలయాల ఆస్థాన పండితులు, అర్చకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామభద్రక్షేత్రంలో తెలంగాణ విత్వత్సభ పంచమ వార్షిక విద్వత్సమ్మేళనం రెండు రోజులుగా జరుగుతున్నది. ఈ విద్వత్సభలో శుభకృత్ 2022-23 సంవత్సరంలో పండగల తేదీలను ఏకాభిప్రాయంతో నిర్ణయించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు పంచాంగాల్లో ప్రచురించనున్నారు. చివరిరోజైన శనివారం విద్వత్సభకు ముఖ్యఅతిధిగా హాజరైన విద్యాశంకర భారతీస్వామి మాట్లాడుతూ.. పంచాంగాన్ని నిర్ణయించే క్రమంలో ఏకవ్యక్త ప్రతిపాదన మేర నిర్ణయాలు తీసుకోవటం మన కర్తవ్యమని చెప్పారు. కార్యక్రమంలో వేదశాస్త్ర పండితుడు పురాణం మహేశ్వరశర్మ, జ్యోతిష పండితుడు డాక్టర్ సాగి కమలాకరశర్మ, వేదశాస్త్ర పండితుడు డాక్టర్ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, దోర్భల ప్రభాకరశర్మ, సంపత్కుమార కృష్ణమాచార్య, శృంగేరిపీఠం ఆస్థాన జ్యోతిష పండితుడు డాక్టర్ శంకరమంచి రామకృష్ణశర్మ, అష్టకాల రామ్మోహన్శర్మ, జగన్మోహనశర్మ, యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దేవస్థాన ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, మరుమాముల (దర్శనం) వెంకటరమణశర్మ, యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, రంగి సత్యనారాయణశాస్త్రి, బోర్పట్ల హనుమంతచారి, పండరి సంతోష్కుమార్శర్మ, డాక్టర్ మోత్కూరు సత్యనారాయణశాస్త్రి, వేదపండితులు, అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు.
ముఖ్యమైన పండుగల వివరాలు
తేది పండుగ
02-04-2022 ఉగాది
10-04-2022 శ్రీరామనవమి
25-05-2022 శ్రీహనుమాన్ జయంతి
31-08-2022 వినాయకచతుర్థి
25-09-2022 పితృ అమావాస్య
03-10-2022 సద్దుల బతుకమ్మ
05-10-2022 విజయదశమి
24-10-2022 దీపావళి
15-01-2023 సంక్రాంతి
18-02-2023 మహాశివరాత్రి
07-03-2023 హోలీ