హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(హెచ్సీయూ) ఖాతాలో మరో పేటెంట్ వచ్చి చేరింది. హెచ్ఐవీ చికిత్సలో డ్రగ్ కాంబినేషన్ సమర్థత పెంచేందుకు అభివృద్ధి పరిచిన ‘హై యాక్టివ్ యాంటీ రిట్రో వైరల్ కాంబినేషన్ డ్రగ్స్ లోడెడ్ లాక్టోఫెరిన్ నానో పార్టికల్స్ ఫర్ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ థెరపీ’సాంకేతికతకు కేంద్రం పేటెంట్ను మంజూరు చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్లో ఉన్న మాలిక్యులార్ థెరప్యూటిక్స్ ల్యాబొరేటరీలో దీనికి రూపకల్పన చేశారు. ఈ పరిశోధనలకు వర్సిటీ ప్రొఫెసర్ అనంద్ కే కొండెపి నేతృత్వం వహించారు. ఈ సాంకేతికత ద్వారా హెచ్ఐవీ రోగులకు ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకుండా, మందులు నేరుగా హెచ్ఐవీ సోకిన కణాలనే లక్ష్యంగా చేసుకుంటాయని ఆయన వివరించారు. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటామని పేర్కొన్నారు.