హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యవిద్య, వైద్యసేవలను పటిష్ఠం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచి బీఎస్సీలో 12 రకాల వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రారంభించనున్నారు. ఆయా కోర్సుల కాలపరిమితి మూడేండ్లు, తర్వాత ఒక ఏడాదిపాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలతోటు ఆదిలాబాద్లోని రిమ్స్, వరంగల్లోని కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతోపాటు, వైద్య విద్యను విస్తృతం చేసేందుకు సీఎం కేసీఆర్ వేగంగా చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించగా, మరో రెండేండ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటుచేయనున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యవిద్య అనుబంధ సేవలు పెంచాలని నిర్ణయించారు.
అనస్థీషియా, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్కేర్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులార్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా కోర్సుల్లో ఏటా 860 మంది విద్యార్థులకు సీట్లు లభించనున్నాయి. తద్వారా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు మరింతగా మెరుగుపడనున్నాయి.