Science Congress | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): శాస్త్రవేత్తలు, సైన్స్ కుటుంబం అంతా ఘనంగా జరుపుకొనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్ జేఎన్టీయూలో జరగాల్సిన 109వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్నది. దీని నిర్వహణకు కేంద్రం ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. కరోనా సమయంలో తప్ప ఏటా ఏటా సైన్స్ నిరాటంకంగా కొనసాగింది. ఈ కాంగ్రెస్ నిర్వహణకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) రూ.5 కోట్లు అందజేస్తుంది.
కానీ, ఈ ఏడాది నిధులను ఇవ్వబోమని డీఎస్టీ స్పష్టంచేసింది. 2024లో జరిగే సైన్స్ కాంగ్రెస్కు అన్ని రకాల వనరులను నిలిపివేస్తున్నట్టు గత సెప్టెంబర్లో ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరోసారి పునరుద్ఘాటించింది. సైన్స్ కాంగ్రెస్లో చర్చించే అంశాలు (కంటెంట్), కేంద్ర ప్రభుత్వంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కున్న విబేధాలే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. నిధుల లేమి, కేంద్రం సహకరించకపోవడంతో ఇప్పటికే ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్ను లక్నో వర్సిటీ నిర్వహించాల్సి ఉండగా, అక్కడి నుంచి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీకి మార్చారు. అక్కడా సహకరించే పరిస్థితులు లేకపవడంతో జేఎన్టీయూకు మార్చారు.
ఈ ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని జేఎన్టీయూలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్వహణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ కార్యక్రమ నిర్వహణకు రూ.50 కోట్లు ఇవ్వాలని జేఎన్టీయూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అటు డీఎస్టీ సహాయ నిరాకరణ చేస్తుండగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు, సీఎస్సార్ నిధులను సమీకరించేందుకు జేఎన్టీయూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.