జైనథ్, ఫిబ్రవరి 29: ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో బుధవారం పరీక్షల ప్రారంభం రోజే కొందరు విద్యార్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేకపోయామని కన్నీళ్లు పెట్టుకుంటూ నిరాశతో వెనుదిరిగితే..
గురువారం జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థి ప్రాణాన్నే బలితీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగూర్లకు చెందిన శివకుమార్(17) ఆదిలాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనికి ఆదిలాబాద్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో సెంటర్ పడింది. గురువారం ఉదయం తెలుగు పరీక్ష రాయడానికి సొంతూరు నుంచి ఆటోలో 8.30 గంటలకు బయలుదేరాడు. ఆదిలాబాద్కు బస్టాండ్కు చేరుకునే సరికి 8.55 గంటలు అయింది.
9 గంటలకే పరీక్ష ఉండటంతో.. అక్కడి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లే సరికి ఆలస్యం అవుతుందని తీవ్ర ఆందోళన చెందాడు. పరీక్ష రాయలేకపోయాననే మనస్తాపంతో వెనుదిరిగి సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాజెక్టు వద్ద సూసైడ్ నోట్, రిస్ట్ వాచ్, ఇతర వస్తువులు లభించాయి. ఇంటర్ పరీక్ష రాయకపోవడం చాలా బాధగా ఉందంటూ తండ్రి రామును ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసి ఉంచాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుడి తల్లి టేకం పంచపుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పురుషోత్తం తెలిపారు. టేకం పంచపుల-రాము దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు తల్లిదండ్రులతోపాటే కూలిపని చేస్తుండగా.. బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న రెం డో కుమారుడు ఇలా అఘాయిత్యానికి పాల్పడటంపై తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.