హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి పీహెచ్డీ తప్పనిసరి కాదని, యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో అర్హత సాధిస్తే సరిపోతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం జగదీశ్కుమార్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కొత్తగా నిర్మించిన యూజీసీ-హెచ్ఆర్డీసీ నూతన భవనాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో యూజీసీ చైర్మన్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించాల్సిన బాధ్యత తమపైన ఉన్నదని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంపై చర్చించారు. పరిశోధనా ప్రాజెక్టులు, జాతీయ డిజిటల్ విశ్వ విద్యాలయం, అధ్యాపకుల భర్తీకి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ఓయూ అధ్యాపకులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు.
అధ్యాపకులు నైతిక విలువలు, సమయ పాలన, యోగా, ధ్యానం, వాకింగ్ వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. విదేశీ వర్సిటీలను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డ అయిన ప్రొఫెసర్ జగదీశ్కుమార్ ఈ ప్రాంతానికి గైడింగ్ ఫోర్స్గా ఉండాలని కోరారు. ఓయూలో ఏడాదిన్నర నుంచి చేపడుతున్న అభివృద్ధి, రిసెర్చ్ పనుల గురించి యూజీసీ చైర్మన్కు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరించారు. పరిశోధనలు ప్రోత్సహించేందుకు వైస్ చాన్స్లర్ అవార్డు విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, డీన్ ప్రొఫెసర్ మల్లేశంతోపాటు హెచ్ఆర్డీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ స్మితా సీ పవార్, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరామ్వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.