న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఉదయ్ కొటక్ అనూహ్యంగా కొటక్ బ్యాంక్ నుంచి వైదొలిగారు. శనివారం ఆయన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్గాను వ్యవహరించనున్నారు. ఉదయ్ కొటక్ పదవీ విరమణ కంటే నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేయడం విశేషం. ఆయన రాజీనామాకు గల కారణాలు మాత్రం బ్యాంక్ వెల్లడించలేదు. కొన్ని నెలలు సమయం ఉన్నప్పటికీ ముందుగానే రాజీనామా చేశాను..ఈ నిర్ణయం వెంటనే అమలులోకి రానున్నది. గత కొంతకాలంగా ఈ విషయంపై చర్చించి, ఇది సరైన సమయమని భావించి రాజీనామా సమర్పించాను అని ఉదయ్ కొటక్ బ్యాంక్ బోర్డుకు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
985లో ముంబైలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థ..ప్రస్తుతం లక్ష ఉద్యోగులను కలిగివున్నది. 38 ఏండ్ల క్రితం బ్యాంకులో రూ.10 వేలు పెట్టిన వారికి ఇప్పుడు రూ.300 కోట్ల రాబడిని సృష్టించింది. కొటక్ బ్యాంక్లో ప్రమోటర్ల వాటా 25.76 శాతం వాటా ఉండగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు 41.54 శాతం వాటా ఉన్నది. అలాగే దేశీయ సంస్థలకు 19.4 శాతం వాటా ఉన్నది. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన కొటక్ బ్యాంక్లో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎండీ, సీఈవో పదవలకు రాజీనామా చేసినప్పటికీ..బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు.
బ్యాంక్ యాజమాన్యంలో మార్పులు చేయాలని రిజర్వు బ్యాంక్ ఇచ్చిన గడువు కంటే ముందుగానే ఉదయ్ కొటక్ వైదొలగడం విశేషం. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ ఎండీ, సీఈవోగా 15 ఏండ్లు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.