హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీ-వర్క్స్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. డ్రోన్ మాదిరిగా నిలువుగా టేకాఫ్తోపాటు ల్యాండింగ్ అయ్యే సామర్థ్యం గల అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ (యూఏవీ)ని తయారుచేసి విజయవంతంగా ప్రయోగించింది. గురువారం బేగంపేట విమానాశ్రమంలో నిర్వహించిన ట్రయల్ రన్లో 33 నిమిషాల్లో 45 కిలోమీటర్లు ప్రయాణించింది. దీనిని పూర్తిగా టీ-వర్క్స్ సొంత పరిజ్ఞానంతో తయారుచేయడం గమనార్హం. రెండోదశలో 3.5 కేజీల బరువుతో 100 కిలోమీటర్లు ప్రయాణించేలా ప్రయోగం చేస్తామని టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి తెలిపారు. ప్రస్తుతం 20-25 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయని, ఒకేసారి ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణించేవి చాలా అరుదుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి కేవలం మెడికల్ అవసరాల రవాణాకే కాకుండా సర్వేలు, తనిఖీలతోపాటు నిఘా వ్యవస్థలో కూడా ఉపయోగపడుతాయని వెల్లడించారు.