రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ పోలీసులు ద్విచక్రవాహనాల దొంగను అరెస్ట్ చేశారు. వాహన తనిఖీలు చేస్తుండగా ఉప్పల్లోని వీటీ కమాన్ వద్ద దొంగిలించిన యాక్టివా మోటార్సైకిల్పై బుధవారం అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని ఆపి, ప్రశ్నించారు. దీంతో అతడు చేసిన 22 ఆటోమొబైల్ నేరాలను అంగీకరించాడు. నిందితుడిని సూర్యాపేట జిల్లాకు చెందిన వంగల రాజుగా పోలీసులు గుర్తించారు. అతడి వద్దనుంచి దొంగిలించిన వాహనాలతోపాటు రూ. 13, 50,000లు రికవరీ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా ఏటూరుకు చెందిన వంగల రాజు (19) లైటింగ్ వర్క్స్ చేస్తుంటాడు. వివిధ రకాల మోటార్సైకిళ్లపై రోడ్లపై తిరగడం ఇష్టం. రాత్రివేళల్లో నగరానికి వచ్చి బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో మోటార్సైకిళ్ల కోసం వెతుకుతుంటాడు. పరిసరాలను గమనించి సెక్యూరిటీ గార్డులు లేని సమయంలో డూప్లికేట్ కీతో మోటారు సైకిళ్లను ఎత్తుకెళ్తుంటాడు. వాటిని ఏటూరు గ్రామస్తులకు విక్రయించేవాడు. తాను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఏజెంట్గా పనిచేస్తున్నానని, ఫైనాన్స్ కంపెనీ నుంచి తక్కువ ధరకు వాహనాన్ని కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు చెప్పేవాడు. వచ్చిన డబ్బులను తన విలాసాలకు వెచ్చించేవాడు.
నిందితుడిని పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం. భగవత్, అదనపు పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు, రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షిత కే మూర్తి, మల్కాజ్గిరి జోన్ క్రైం డీసీపీ యాదగిరి పర్యవేక్షణలో మల్కాజ్గిరి ఏసీపీ పీ నరేశ్రెడ్డి, మల్కాజిగిరి, ఇన్స్పెక్టర్ ఆర్ గోవింద్రెడ్డి, డీఐ ఆఫ్ పోలీస్ నర్సింగ్ రావు, డీఎస్ఐ ఎస్. కోటేశ్వర్రావు, క్రైమ్ టీమ్ పట్టుకున్నది.