హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీకి 26 వేల క్యూసెక్కుల జలాలు వస్తున్నాయి. ప్రాణహితలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రానికి 65 వేల క్యూసెక్కుల జలాలు లక్ష్మి బరాజ్కు చేరుతుండగా, 32 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్కు వరద ఉధృతి పెరిగింది. సీతమ్మసాగర్ వద్ద 1.17 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. మరోవైపు కృష్ణాలో వరద ప్రవాహం మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, తుంగభద్రకు శుక్రవారం 9,582 క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి అది 8 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పరీవాహక ప్రాంతం నుంచి 6,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
యథావిధిగా కాళేశ్వరం జలాల తరలింపు
లక్ష్మి బరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. ఎస్సారెస్పీకి స్వల్ప వరద ప్రారంభమైన నేపథ్యంలో ఆ మేరకు పంపింగ్ను తగ్గించారు. శుక్రవారం 5 పంపుల ద్వారా లక్ష్మి పంప్హౌస్ నుంచి ఎస్సారెస్పీకి తరలించగా, శనివారం 4 పంపుల ద్వారానే పంపింగ్ కొనసాగించారు. ఇరత పంప్హౌస్ల్లోనూ మోటర్లను తగ్గించి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 2.5 టీఎంసీల జలాలను లక్ష్మి బరాజ్ నుంచి ఎస్సారెస్పీకి తరలించారు.