హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట, గుత్తి లోకోషెడ్లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో ఈ రెండు లోకోషెడ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టుగా ఎంపిక చేస్తూ గురువారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాజీపేట్లోని డీజిల్ లోకోషెడ్ ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో నంబర్వన్ స్థానంలో నిలువగా, గుత్తి డీజిల్ లోక్షెడ్ ద్వితీయ స్థానంలో ఉన్నది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 94 శాతం ఇప్పటికే విద్యుద్ధీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో నడిచే రైళ్లు రోజురోజుకు పెరుగుతున్నందునఎల్రక్ట్రిక్ లోకోల నిర్వహణ కోసం సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉన్నదని దక్షిణ మధ్య రైల్వే జోన్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు.