పెగడపల్లి, మార్చి 19: జాతీయ పక్షి నెమలిని(Peacock )ఇద్దరు దుండగులు వేటాడి తుపాకీలో కాల్చి (Shooting) చంపిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట సమీపంలోని ఎస్సారెస్పీ(SRSP) కాలువ వద్ద చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జగిత్యాల డీఎస్పీ డీ రఘుచందర్ మంగళవారం వివరించారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన నలువాల సత్యనారాయణ, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన జువ్వాజి రాజు సోమవారం రాత్రి దోమలకుంట సమీపంలో నెమలిని వేటాడి తుపాకీతో కాల్చి చంపారు. తర్వాత కారులో తరలిస్తుండగా, ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఎస్ఐ రామకృష్ణ వెంటనే సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టగా, సత్యనారాయణ, జువ్వాజి రాజు ప్రయాణిస్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించింది.
దీంతో వారు కారును తనిఖీ చేయగా, అందులో లైసెన్స్ లేని తుపాకీ, గొడ్డలితోపాటు 34 బుల్లెట్లు, నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, సత్యనారాయణ 2017లో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ జింకలను హత మార్చిన కేసులో ప్రధాన నిందుతుడు అని, ఆ కేసు ఇంకా నడుస్తున్నదని డీఎస్పీ తెలిపారు.