Kidney Patients | హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిడ్నీ రోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాలకు కిడ్నీ రోగులు పోటెత్తడం, అధిక సమయం వేచి ఉండాల్సి ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో మరో మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణుగూరులోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, ఇల్లందులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం నాడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించనున్నారు. అశ్వరావుపేటలో మూడో డయాలసిస్ సెంటర్ను ఈ నెలాఖరు వరకు ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐదు మెషీన్లతో, భద్రాచలం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో 10 మెషీన్లతో డయాలసిస్ సెంటర్లను కొనసాగిస్తున్నారు. అయితే ఈ సెంటర్లు కిడ్నీ రోగులకు సరిపోవడం లేదు. కిడ్నీ రోగుల తాకిడి ఎక్కువైనందున మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేటలో కొత్తగా డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.