హైదరాబాద్/సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో గురువారం మరో ఇద్దరిని సిట్ అరెస్టు చేసింది. ఖమ్మం జిల్లా చిన్నమదంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అజ్మీర పృథ్వీ రూ.2 లక్షలకు మురళీధర్ నుంచి ఏఈఈ పేపర్ను, ఆదిలాబాద్ జిల్లా నర్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేశ్వర్జాదవ్ ఏఈ ప్రశ్నపత్రాన్ని రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. మురళీధర్ను ఇది వరకే అరెస్టు చేయగా, తాజాగా పృథ్వీ, రాజేశ్వర్ అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు 37 మంది నిందితుల్లో 36 మందిని సిట్ అరెస్టు చేసింది.
టాపర్స్కు రిమాండ్
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఎవో) పరీక్షలో రెండో ర్యాంకు సాధించిన రాజేశ్వర్ భార్య శాంతి, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి భార్య సుచరితరెడ్డి, రేణుక స్నేహితుడు నూతన్ రాహుల్తోపాటు పేపర్ లీకేజీలో దళారీగా వ్యవహారించిన రమావత్ దత్ను సిట్ గురువారం కోర్టులో హాజరు పరిచింది. ఈ నలుగురి నిందితులను కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
నిందితులకు హైకోర్టు బెయిలు నిరాకరణ
ఇదే కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరుకు హైకోర్టు నిరాకరించింది. 17వ, 18వ నిందితులు సాయి లౌకిక్, సాయి సుష్మిత బెయిల్ కోసం గురువారం వేసవి సెలవుల వెకేషన్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై గురువారం జస్టిస్ సాంబశివరావునాయుడు విచారణ జరిపారు. ఈ వాదనలను విన్న హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుకు పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది.