హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ మరో ఇద్దరు అధికారులను అరెస్టు చేసింది. దీంంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఆరుకు చేరుకున్నది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ అధికారి అయిన అంజిలప్ప (ఏ7)ను, ఇదే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీ కృష్ణయ్యను ఏసీబీ గురువారం అదుపులోకి తీసుకున్నది. విచారణ అనంతరం నిందితులను ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. గొర్రెల కొనుగోలు విషయంలో వీరు ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు వ్యక్తులను చేర్చి, వారి ఆదేశాలను పాటించేలా సూచనలు చేసినట్టు విచారణలో తేలింది. వీరు కలెక్టర్కు పంపిన నకిలీ అమ్మకందారుల వివరాలతో నిజమైన వారు కాకుండా, నకిలీ అమ్మకందారులు డబ్బు పొందారని, దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొన్నారు.